తిరుమల, ప్రభన్యూస్ : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం పెరిగింది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో దేశ విదేశాల నుంచి తిరుమల భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమల గిరులలో ఎటుచూసినా భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు, విద్యార్దులకు పరిక్షలు ముగియడం, అందులో వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. దీంతో సర్వదర్శనానికి సరాసరి 24 గంటల సమయం భక్తులు క్యూ లైన్లో వేచివుండి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కాగా రూ.300 ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులు వారివారి కేటాయించి సమయంలో క్యూ లైన్లోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో సందర్శనీయ ప్రాంతాలైన పాపవినాశనం, శ్రీవారి పాదాలు, తదితర దర్శనీల ప్రాంతాలలో కూడా భక్తులు సందడి చేస్తున్నారు.
కాగా వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి అధికారుల వారాంతంలో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసి ప్రోటోకాల్ పరిధిలో వారికి మాత్రమే కేటాయిస్తున్నారు. ఇక అధిక రద్దీ కారణంగా తిరుమలలో గదులు దొరకని భక్తులు టిటిిడ ఏర్పాటు చేసిన లాకర్లను పొంది సేదతీరుతున్నారు. అలాగే టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచివున్న భక్తులను ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ క్యూ లైన్లు త్వరిత గతిన కదిలేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా క్యూ లైన్లో వేచివున్న భక్తులకు అన్నప్రసాదం విభాగం అధికారులు శ్రీవారి సేవకుల సహాయంలో తాగునీరు, అల్పాహారం లాంటివి నిరంతరాయంగా అందచేస్తున్నారు. ఈ రద్దీ సోమవారానికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..