Wednesday, April 24, 2024

జూలై 21 నుండి 23 వరకు కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి : శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూలై 20న సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా జూలై 21న మొద‌టిరోజు ఉదయం ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ‌సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ నిర్వ‌హిస్తారు. జూలై 22న రెండో రోజు ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేప‌డ‌తారు. జూలై 23న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement