Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 22
22
పురుష: ప్రకృతిస్థో హి
భుంక్తే ప్రకృతిజాన్‌ గుణాన్‌ |
కారణం గుణసంగోస్య
సదసద్యోనిజన్మసు ||

తాత్పర్యము : భౌతిక ప్రకృతియందు త్రిగుణముల ననుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ, అధమ జన్మలను పొందుచుండును.

భాష్యము : జీవుడు ఒక శరీరమును వదిలి మరొక శరీరమునకు ఎలా మార్పు చెందుతాడే తెలుసుకొనుటకు ఈశ్లోకము చాలా ముఖ్యమైనది. ఈ శ్లోకమున భౌతిక ప్రకృతిని అనుభవించాలనే కోరికే జీవుని ఒక శరీరము నుండి మరొక శరీరమునకు మార్పు చెందించుచూ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చేటట్లు చేస్తుంది. ఏ విధముగా జీవుడు వేర్వేరు గుణాలతో సంపర్కములోనికి వచ్చునో వాటికి తగిన శరీరములను పొందును. కొన్నిసార్లు దేవతగా, మానవునిగా, పశువుగా, జలచరముగా, పుణ్యాత్మునిగా మరియు క్రిమి కీటకముగా జన్మించును. త్రిగుణాలను అధిగమించనంతవరకూ ఈ జనన మరణ చక్రము నుండి ఎవరూ బయటపడలేరు. అది కేవలము కృష్ణచైతన్యము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అర్జునుని వలే జీవుడు కూడా కృష్ణుని నుండి శ్రవణము చేసి విధేయతతో విన్నవాటిని పాటించినట్లయితే క్రమేణ భౌతిక ప్రకృతిని అనుభవింపవలెనన్న కోరిక సన్నగిల్లి, తత్ఫలితముగా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించే స్థితికి చేరుకుంటాడు. రాబోవు శ్లోకాలలో ఈ విషయము మరింత స్పష్టము చేయబడుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement