Wednesday, April 24, 2024

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి : ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 31 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధ‌నంజ‌యులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వాహన సేవలు :
తేదీ ఉదయం సాయంత్రం
31-03-2023 ధ్వజారోహణం(వృషభలగ్నం) శేష వాహనం
01-04-2023 వేణుగానాలంకారము హంస వాహనం
02-04-2023 వటపత్రశాయి అలంకారము సింహ వాహనం
03-04-2023 నవనీత కృష్ణాలంకారము హనుమత్సేవ
04-04-2023 మోహినీ అలంకారము గరుడసేవ
05-04-2023 శివధనుర్భంగాలంకారము కళ్యాణోత్సవము/ గజవాహనము

06-04-2023 రథోత్సవం
07-04-2023 కాళీయమర్ధనాలంకారము అశ్వవాహనం
08-04-2023 చక్రస్నానం ధ్వజావరోహణం.
ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement