Friday, March 29, 2024

Business: వేతనాల పెంపు కొనసాగిస్తాం: విప్రో

ఉద్యోగుల వేతనాల పెంపులో ఎలాంటి మార్పులేదని, ఆ ప్రక్రియ యదావిధిగానే కొనసాగుతందని సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ విప్రోపేర్కొంది. సెప్టెంబర్‌1 నుంచి తమ ఉద్యోగుల వేతనాల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. త్రైమాసిక ప్రమోషన్ల మొదటి దశను పూర్తిచేసినట్లు చెప్పింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కొన్ని బ్యాండ్‌ల ఉద్యోగులకు వేరియబుల్‌ చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు మీడియాలో నివేదికలు వచ్చాయి. దీనిపై ఐటీ దిగ్గజం స్పందించి ఈ మేరకు వివరణ ఇచ్చింది. వేతనాల పెంపుపై మా మునుపటి ప్రకటనలో మార్పులేదు.

మా ఉద్యోగుల వేతనాల పెంపుల సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మేము జులై 1 నుంచి మొదటి త్రైమాసిక ప్రక్రియను కూడా పూర్తిచేశాము అని విప్రో గురువారం నాటి ప్రకటనలో తెలిపింది. అయితే, తన ఉద్యోగులకు వేరియబుల్‌ పే చెల్లించే అంశంపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో మార్జిన్‌ఒత్తిళ్ల కారణంగా మధ్య తరగతి, సీనియర్‌ స్థాయి ఉద్యోగులకు వేరియబుల్‌ పే చెల్లింపులు నిలిపివేస్తుందనే నివేదికలు గతంలోనూ మీడియాలో వచ్చాయి.

ప్రమోషన్లు కొనసాగుతాయ్‌..
గతేడాది ఇదే కాలంలో 18.8 శాతం నుంచి జూన్‌ చివరి త్రైమాసికంలో సంస్థ 15 శాతం తక్కువ మార్జిన్‌ను చూసింది. ఈ ఏడాదిజులై నుంచి కొత్త ఉద్యోగుల ప్రమోషన్లు ప్రారంభం కానున్నాయని ఇదివరకే విప్రో స్పష్టంచేసింది. మిడ్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగుల వరకు తమ టాప్‌ పెర్‌ఫార్మర్‌లకు కంపెనీ త్రైమాసిక ప్రమోషన్‌లను అందజేస్తుందని నివేదిక పేర్కొంది. విప్రో తన ఉద్యోగులకు ప్రతి త్రైమాసికంలో వేరియబుల్‌ పే ఇస్తుంది. ఎ, బి, రెయిన్‌బో బ్యాండ్‌లలో ఉద్యోగులకు ఈ రకమైన చెల్లింపులు చేస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement