Wednesday, April 24, 2024

భారీ నష్టాలతో వారాంతం.. సెన్సెక్స్‌ పాయింట్ల క్షీణత..

ప్ర‌భ‌న్యూస్ : వరుసగా రెండు రోజుల లాభాల తర్వాత లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వడంతో వారాంతం శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు గణనీయ నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 756 పాయింట్లు లేదా 1.31 శాతం నష్టపోయి 57,696 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 50 సూచీ 205 పాయింట్లు లేదా 1.18 శాతం క్షీణించి 17,197 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ దాదాపు 821 పాయింట్ల వరకు పతనమైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహింద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ వంటి స్టాకులు క్షీణించడంతో నిఫ్టీ సూచీలో ఇంట్రాడేలో 17,180 స్థాయికి దిగజారింది. ఎస్‌ఎస్‌ఈపై మీడియా రంగం మినహా అన్ని రంగాలలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ హెల్త్‌కేర్‌ సూచీ గరిష్ఠంగా 1.2 శాతం మేర దిగజారింది.

నిఫ్టీ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఆటో, బ్యాంక్‌ సూచీలు 0.7 శాతం నుంచి 1.15 శాతం వరకు పతనమయ్యాయి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు రాణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ ఫ్లాట్‌గా ముగియగా.. నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 100 సూచీ 0.8 శాతం మేర వృద్ధి చెందింది. నిఫ్టీపై పవర్‌గ్రిడ్‌ 4 శాతం వరకు క్షీణించి అతిపెద్ద నష్టదారుగా నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోటక్‌ మహింద్రా బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ లైఫ్‌, టెక్‌ మహింద్రా, ఐటీసీ, సన్‌ఫార్మా షేర్లు 1.75 – 2.8 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు యూపీఎల్‌, భారత్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, కోలిండియా షేర్లు లాభాలతో ముగిశాయి. మొత్తంగా బీఎస్‌ఈపై 1804 షేర్లు లాభపడగా.. 1452 షేర్లు నష్టాలతో ముగిశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement