Thursday, April 25, 2024

రెండేళ్ల తరువాత , ఆరో సారి నష్టాలు.. వరుస సెషన్స్ లో సూచీల క్షీణత

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల నుంచి స్వల్ప నష్టాలతో ముగిశాయి. వరుసగా ఆరు సెషన్స్‌ నష్టాలను చూడటం కూడా రెండేళ్ల తరువాత ఇదే తొలిసారి. గడిచిన ఆరు సెషన్స్‌లో సూచీలు నష్ట పోతూనే ఉన్నాయి. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో అప్పటి వరకు ఉన్న లాభాలన్నీ నష్టాల్లోకి జారుకున్నాయి. గడిచిన ఆరు రోజుల్లో స్టాక్‌ మార్కెట్‌లో రూ.13లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి. ఉదయం సెన్సెక్స్‌ 53,565.74 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 53,785.71 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,654.89 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 136.69 పాయింట్లు నష్టపోయి.. 52,793.62 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయ్యింది. ఇక నిఫ్టీ ఉదయం 15,977.00 వద్ద లాభాల్లో ప్రారంభమై.. 16,083.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,740.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని నమోదు చేసుకుంది. చివరికి 25.85 పాయింట్లు నష్టపోయి.. 16వేల దిగువన అంటే 15,782.15 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.48 వద్ద ట్రేడ్‌ అవుతున్నది.

ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌
సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ ఫార్మా, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, టైటాన్‌, రిలయన్స్‌, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా క్యాపిటల్‌ మార్కెట్‌లో ఉన్న భయీలే దేశీయ సూచీలను దిగజారుస్తున్నాయి. స్థూలంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు, ఉక్రెయిన్‌-రష్యా వార్‌, చమురు ధరలు పెరగడం, త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోకపోవడం వంటి కారణాలు స్టాక్‌ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement