Tuesday, April 23, 2024

చమురు ధరలు తగ్గుతాయన్న ప్రపంచ బ్యాంక్‌

రానున్న రెండు సంవత్సరాల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతాయని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. గత ఐదు సంవత్సరాల సగటు ధరలతో పోల్చితే మాత్రం ఎక్కువగానే ఉంటయాని తెలిపింది. చాలా దేశాల కరెన్సీల విలువ క్షీణించినందున ధరలు తగ్గినప్పటికీ దిగుమతులు భారంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఫలితంగా ఆహార, ఇంధన సంక్షోభం రావొచ్చని అభిప్రాయడింది. ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు మందగించడం కూడా చమురు ధరలు దిగిరావడానికి దోహదం చేస్తుందని తెలిపింది. చమురు ధరలు 2023లో 11 శాతం, 2024లో 12 శాతం తగ్గే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ ఓ నివేదికలో పేర్కొంఇ. ఈ లెక్కన బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 2023లో 92 డాలర్లు, 2024లో 80 డాలర్ల వద్ద చిలించే అవకాశం ఉంది. గత ఐదేళ్ల సగటు ధర 60 డాలర్లతో పోలిస్తే ఇది ఎక్కువేనని తెలిపింది. సహజ వాయువు, బొగ్గు ధరలు సైతం 2023లో తగ్గుతాయని పేర్కొంది. అయినప్పటికీ గత ఐదు సంవత్సరాల సగటుతో పోల్చితే మాత్రం ధరలు రెండింతలకు పైనే ఉంటాయని పేర్కొంది. 2023లో ఆహార ధాన్యాల దిగుబడులు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని హెచ్చరించింది.

ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతల మూలంగ అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక అభిప్రాయపడింది. మరో వైపు అధిక చమురు ధరల వల్ల ఆహారధాన్యాలు, వంటనూనెల రేట్లు పెరుగుతాయని అంచనా వేసింది. అలానే ప్రతికూల వాతావరణం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు సైతం తగ్గుతాయని పేర్కొంది. భారత్‌లో సెప్టెంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.6 శాతం ఉందని తెలిపింది. సుగంధ ద్రవ్యాల ధరలు 16.88 శాతం, కూరగాయల ధరలు 18.5 శాతం పెరిగాయని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార భద్రతకు సవాళ్లు ఎదురవుతాయని నివేదిక తెలిపింది. దీన్ని అధిగమించేందుకు సరఫరాల్లో వేగాన్ని పెంచడంతో పాటు, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందకు అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల విధాన నిర్ణయం కర్తలకు పెద్ద సవాల్‌ వంటిదని, ఈ దేశాలు ఒంటరిగా దీన్ని నియంత్రించే శక్తి సరిపోదని తెలిపింది. ఈ దేశాలు అత్యంత జాగ్రత్తగా ద్రవ్య, ఆర్ధిక విధానాలను రూపొందించుకోవాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement