Saturday, April 20, 2024

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 19లక్షల కోట్ల ఎం క్యాప్‌.. తొలి కంపెనీగా రికార్డు

ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.19 లక్షల కోట్ల మార్కును క్రాస్‌ చేసింది. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీ రిలయన్స్‌గా చరిత్రలో నిలిచింది. రిలయన్స్‌ షేర్లు సరికొత్త రికార్డును తాకిన నేపథ్యంలో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.19లక్షల కోట్లను తాకింది. రిలయన్స్‌ షేర్‌ వ్యాల్యూ బుధవారం మధ్యాహ్నం 1.85 శాతం ఎగిసి రూ.2,827ను తాకింది. రిలయన్స్‌ షేర్‌ బీఎస్‌ఈలో రూ.2827ను తాకడంతో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.19,12,184 కోట్లకు చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి 0.013 శాతం లాభపడి.. రూ.2,776 వద్ద నిలిచింది. ఉదయం రిలయన్స్‌ షేరు రూ.2,755.85 వద్ద ప్రారంభం అవ్వగా.. రూ.2,828 వద్ద గరిష్టాన్ని, రూ.2755.05 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ ఏడాది మార్చిలోనే కంపెనీ మార్కెట్‌ వ్యాల్యూ రూ.18లక్షల కోట్లు దాటింది. గత ఏడాది అక్టోబర్‌ 13 కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.17లక్షల కోట్లను తాకింది. వారం క్రితం కంపెనీ షేర్‌ వ్యాల్యూ 52 వారాల గరిష్టాన్ని తాకి రూ.2,789 వద్ద ఉన్నప్పుడు కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.19లక్షల కోట్ల సమీపానికి చేరుకుంది. రిలయన్స్‌ 52 వారాల గరిష్టం రూ.2,828 కాగా.. 52 వారాల కనిష్టం రూ.1906. రియలన్స్‌ మార్కెట్‌ వ్యాల్యూ నెల రోజుల్లోనే రూ.18లక్షల కోట్ల నుంచి రూ.19 లక్షల కోట్లకు చేరుకుంది. 2022 క్యాలెండర్‌ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ షేర్‌ ధర 19 శాతానికి పైగా పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement