Friday, March 29, 2024

Followup: భారీ లాభాల్లో సూచీలు.. 90 డాలర్ల దిగువకు ముడి చమురు

స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లోకి దూసుకెళ్లాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు 1శాతం మేరకు పెరిగాయి. బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌కు దన్నుగా నిnలిచాయి. గత రెండు సెషన్లలో నష్టపోయిన ఐటీ, ఆటోరంగ స్టాక్స్‌ పాజివ్‌ ధోరణిలో చలించాయి. అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా కలిసొచ్చాయి. సెన్సెక్స్‌ 659 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ సూచీ 17,799 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్‌ మహింద్ర, యాక్సిస్‌ బ్యాంక్‌, మహింద్రా అండ్‌ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.

టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, టైటాన్‌, నెస్లే, పవర్‌గ్రిడ్‌ స్టాక్స్‌ నష్టాల్లో ముగిశాయి. గురువారం ఒక్కరోజే మదుపరుల సంపద రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య ఉదయం సెన్సెక్స్‌ 59,374 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో59,711 పాయిట్ల గరిష్టాన్ని తాకిన సూచీ, చివరకు 659పాయింట్ల లాభంతో 59,668 వద్ద ముగిసింది. నిఫ్టీసైతం 17800 మార్కును సమీపించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర 90 డాలర్ల దిగువకు చేరడం మార్కెట్‌కు జోష్‌ ఇచ్చింది. చమురు దిగుమతులపై ఆధారపడే ఇండియాకు ఇది సానుకూల అంశంగామారింది. మరొకవైపు అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు రాణించడం మన మార్కెట్లకు కలిసొచ్చింది. విదేశీ సంస్థాగత మదుపరులు మన మార్కెట్‌లో కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటం దేశీయ మార్కెట్లో కొనుగోళ్లకు మద్దతిచ్చింది. బుధవారం రూ.759 కోట్ల షేర్లు కొనుగోలు చేయగా, సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు రూ. 2646 కోట్ల విలువైన పెట్టుబడులను ఎఫ్‌ఐఐలు మన మార్కెట్లోకి తరలించారు. అదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడటం, దేశీయంగా అనుకూల పరిణామాలు ఉండటంతో సూచీలు రాణించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement