Friday, March 29, 2024

5జీ వేలం మ‌రింత స్పీడ్‌.. తొలిరోజు 1.45 లక్షల కోట్ల ఆదాయం..

దేశంలో జరుగుతున్న 5జీ స్పెక్ట్రమ్‌ వేలం మొదిటి రోజు ప్రభుత్వానికి లక్షా 45 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. మొదటి రోజు మొత్తం నాలుగు రౌండ్లు వేలం నిర్వంచారు. బుధవారం నాడు ఐదో రౌండ్‌ ప్రారంభం అవుతుంది. 700 మెగా హెడ్జ్‌ కోసం కూడా బిడ్స్‌ వచ్చాయని మంత్రి వివరించారు. తొలిరోజే వేలంలో అంచనాలకు మించి రికార్డ్‌ స్థాయిలో లక్షా 45 వేల కోట్లు సమకూరాయని మంత్రి వివరించారు. 2015తో పోల్చితే రికార్డ్‌ అని చెప్పారు. వేలం పూర్తయిన తరువాతే ఏ కంపెనీ ఎంత స్పెక్ట్రమ్‌ పొందాయన్న విషయం తెలుస్తుందన్నారు.
తొలిరోజు కంపెనీల నుంచి 3300 మెగాహెడ్జ్‌, 26 గిగాహెడ్జ్‌ కోసం గట్టిపోటీ ఏర్పడిందని చెప్పారు. పోటీలో పాల్గొన్న నాలుగు కంపెనీలు స్ట్రాంగ్‌గానే ఉన్నాయని, టెలికమ్‌ ఇండస్ట్రీ కష్టాల నుంచి గట్టెక్కినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ కేటాయింపులను వేగంగా పూర్తి చేస్తుందని, ఈ సెప్టెంబర్‌ నాటకి 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని మంత్రి ప్రకటించారు. ఆగస్టు 14 నాటికి స్పెక్ట్రమ్‌ కేటాయింపులు పూర్తి చేస్తామన్నారు. వేలంలో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా, అదానీ డేటా నెట్‌వర్క్స్‌ పాల్గొంటున్నాయి. ఈ వేలంలో మొత్తం 4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ను వేలానికి ఉంచారు. 5జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ వేగాన్ని 4జీ కంటే 10 రేట్లు ఎక్కువ చేస్తుంది. ఇది అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్‌. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెట్‌వర్క్‌ పని చేస్తుంది. ఒకే సారి కోట్ల హ్యాండ్‌సెట్లు, సిస్టమ్స్‌ డేటాను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించే మొబైల్స్‌లో వీడియోలు, సీనిమాలను క్షణాల్లోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇ-హెల్త్‌, వాహనాల కనెక్టివిటీ వంటి అనేక సొల్యూషన్స్‌కు ఇది ఎంతో సమర్ధవంతంగా పని చేస్తుంది. నెట్‌వర్క్‌లో ఎలాంటి ల్యాగింగ్‌ ఏర్పడే అవకాశం ఉండదు. మొబైల్‌ క్లౌడ్‌ గేమింగ్‌ వంటి వాటితో వినియోగదారులు ఉన్నతమైన అనుభూతిని పొందుతారు.

ప్రస్తుతం ఈ వేలం 600, 700,800,900,1800,2100,2300 మెగాహెడ్జ్‌ తక్కువ స్థాయి ప్రిక్వెన్సీలోనూ, మిడ్‌ ప్రిక్వెన్సీలో 3300 మెగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ అందుబాటులో ఉంది. ఉన్నస్థాయిలో 26 గిగాహెడ్జ్‌ ప్రిక్రెన్సీ వేలానికి ఉంచారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన బిడ్డింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. తొలిరోజు నాలుగు రౌండ్లు నిర్వహించారు. టలికమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (డాట్‌) అంచనా ప్రకారం ఈ వేలంలో ప్రభుత్వానికి లక్ష కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అందుకు తగినట్లుగానే మొదటిరోజే ప్రభుత్వానికి లక్షా 45 వేల కోట్లు సమకూరాయి. బిడ్డింగ్‌ కోసం ముందస్తు డిపాజిట్‌గా 14 వేల కోట్లు పెట్టిన రిలయన్స్‌ జియోనే అత్యధిక 5జీ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నారు. దీని తరువాత స్థానంలో ఎయిర్‌టెల్‌ ఉండవచ్చని భావిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వోడాఫోన్‌ ఐడియా తరువాతి స్థానంలో నిలవనుంది. అదానీ డేటా నెట్‌వర్క్స్‌ ప్రయివేట్‌ క్యాప్టివ్‌ నెట్‌వర్క్‌ కోసం పాల్గొంటున్నందున తక్కువ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈఎండి చెల్లించిన దానిపై కంపెనీలు 7 నుంచి 8 రేట్లు ఎక్కువ మొత్తాలకు స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు ఖర్చు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాంకేతికంగా చూస్తే తొలిరోజు జియో 1.27 లక్షల కోట్లకు , భారతీ ఎయిర్‌టెల్‌ 48 వేల కోట్లకు, వోడాఫోన్‌ ఐడియా 20 వేల కోట్లకు, అదానీ డేటా 700 కోట్లకు బిడ్డు సమర్పించి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement