Wednesday, March 27, 2024

తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని బాబుకు ఎప్పుడో అర్థమైంది

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణలో పార్టీకి భవిష్యత్తు లేదని బాబుకు ఎప్పుడో అర్థమైందని తెలిపారు. అందుకే ఒక బ్యాచ్ ను కాంగ్రెస్ లోకి, మిగిలిన వాళ్లను గులాబీ పార్టీలోకి వెళ్లాలని ఆదేశించాడని చెప్పారు. ఇప్పటికే నలుగురు ఎంపీలకు బీజేపీ తీర్థం ఇప్పించాడని, అరెస్ట్ భయంతో స్వీయరక్షణ కోసమే ఈ సాగనంపటాలు అని విమర్శించారు.

ప్రజలు ఈడ్చి కొట్టారు కాబట్టి సరిపోయిందని, బాబు ఇంకో పదేళ్లు అధికారంలో ఉండుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరయ్యేదని పేర్కొన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఏనాడూ జనరంజక పాలకుడు కాలేకపోయాడని విమర్శించారు. ఎల్లో మీడియా మద్దతుతో కొనసాగాడని, ప్రజలంటే ఎప్పుడూ చిన్నచూపేనని తెలిపారు. తాగు నీరు దొరక్క జనం అంటువ్యాధుల బారిన పడుతుంటే హిమాలయ బ్రాండ్ మినరల్ వాటర్ తాగేవాడని, 108 అంబులెన్సులను మూల పడేసి, 6 కోట్ల బస్సులో విశ్రమించేవాడని మండిపడ్డారు.

ఉచితంగా కరోనా ఔషధాలు ఇచ్చే ఆనందయ్య మీద కూడా చంద్రబాబు పగబట్టాడని ఆరోపించారు. తన బుట్టలో పడలేదని, సొంతంగా మందు పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడన్న అక్కసుతో వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నాడని ఆరోపించారు. శవాలపై పేలాలు ఏరుకునే పేటెంటు నీదే బాబూ. ఇంత నీచానికి ఇంకెవరూ దిగరు అంటూ విజయసాయి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement