Thursday, April 25, 2024

సోము వీర్రాజు నాలుక కోసేవాడిని.. బీజేపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

కడప జిల్లావాసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సోము వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. అధికార వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనను టార్గెట్ చేశారు. సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు తీవ్రంగా బాధిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అన్నారు. సోము వీర్రాజు జిల్లాలో కనిపిస్తే ప్రజలు దాడిచేస్తారని హెచ్చరించారు. తాను ప్రజాస్వామ్యంలో లేకపోయి ఉంటే.. సోము వీర్రాజు నాలుక కోసేవాడినని రాచమల్లు వ్యాఖ్యానించారు.

కాగా,  ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను సోము వీర్రాజు తప్పు పట్టారు. వైఎస్ జగన్ చేసే ప్రకటనలకు కొదవలేదని, దాన్ని కార్యరూపంలోకి పెట్టరని ధ్వజమెత్తారు. రోడ్లు వేయడానికే దిక్కు లేదని, ఇప్పుడు విమానాశ్రయాలను ఎక్కడి నుంచి తీసుకొస్తారని మండిపడ్డారు.

కడప జిల్లావారిని ప్రాణాలను తీసే వారిగా సోము వీర్రాజు వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. కడపవాసులకు ప్రాణాలను తీయడమే వచ్చని, అలాంటి జిల్లాకు కూడా ఎయిర్‌పోర్ట్ తెచ్చామని పేర్కొనడాన్ని జిల్లావాసులు తప్పుపడుతున్నారు. తమను హంతకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోన్న సోము వీర్రాజు పట్ల చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement