అమరావతి, ఆంధ్రప్రభ : అమాయక గిరిజనులను ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరుడు వైకాపా నేత దూడ విక్టర్బాబు దందాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. శనివారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చట్లవాడకు చెందిన వైకాపా నేత విక్టర్బాబు ఎమ్మెల్సీ అనంతబాబుకు కీలక అనుచరుల్లో ఒకరని ఆయన పేరు చెప్పుకుని గిరిజనులను మోసగిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏడుగురు గిరిజనుల వద్ద రూ. 10 లక్షలు వసూళ్లు చేసి వారిని దారుణంగా మోసగించారని ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. నిరుపేద గిరిజనుల నుంచి లక్షల రూపాయలు దండుకుని జల్సాలు చేస్తున్నారంటూ విక్టర్బాబుపై లోకేష్ మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి గిరిజనులకు వడ్డీతో సహా తిరిగి డబ్బులు మొత్తం ఇప్పించాలని, అలాగే విక్టర్బాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.