Friday, March 29, 2024

గంజాయి స్మగ్లింగ్‌లో మహిళలు, రూటు మార్చిన స్మగ్లర్లు!

(ప్రభన్యూస్‌బ్యూరో ఉమ్మడిరంగారెడ్డి) : గంజాయి స్మగ్లింగ్ రూటు మారింది.. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలనుండి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. దీనిపై సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీలు పెరిగిపోవడంతో గంజాయి స్మగ్లింగ్‌ చేసే వ్యాపారులు కొత్త రూటు ఎంచుకున్నారు. స్మగ్లింగ్‌లో మహిళలను భాగస్వామ్యం చేస్తే పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఇద్దరు మహిళలకు ఎక్కువ కమీషన్‌ ఇస్తామని ఆశ చూపి స్మగ్లింగ్‌లో భాగస్వాములను చేశారు.. అంతా సజావుగా సాగితే గట్టెక్కేవాళ్లే… కానీ కారుల్లోకి మరో కార్లకు గంజాయి మార్పు చేసే విషయమై పోలీసులకు పక్కా సమాచారం ఉండటంతో స్మగ్లర్ల ఆట కట్టడి చేశారు. గంజాయి స్మగ్లింగ్‌లో మొదటిసారి మహిళల భాగస్వామ్యం ఉండటం ఆసక్తికరంగా మారింది..

గంజాయి సాగుపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎక్సైజ్‌ పోలీసులు పెద్దఎత్తున తనిఖీలు చేసి సాగు చేసేవారిపై కేసులు నమోదు చేశారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో చాలావరకు గంజాయి సాగు తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల నుండి పెద్దఎత్తున హైదరాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్నారు. పెద్దఎత్తున దొరికిపోతున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోగంజాయి సరఫరా కొనసాగుతోంది. ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు గంజాయి సరఫరాలో భాగస్వాములవుతున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో గంజాయికు విద్యార్థులు పట్టుబడ్డ విషయం తెలిసిందే…గంజాయికి విద్యార్థులు, యువకులు బానిసలుగా మారడంతో ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపింది. పెద్దఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో తనిఖీలు చేసి సాగు చేసే వారిపై కేసులు నమోదు చేశారు. వికారాబాద్‌ జిల్లాలోని ఎక్సైజ్‌ పోలీసులు సాగు చేస్తున్న వారిపై కేసులు కూడా నమోదు చేశారు. గంజాయి సాగు చేస్తే పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సాగు విస్తీర్ణం చాలావరకు తగ్గింది. అంతర పంటగా గ్రామీణ ప్రాంతాల్లో కొందరు గంజాయి సాగు చేసే వాళ్లు. గతంలో వృద్ధులు నిషా కోసం గంజాయిని ఉపయోగించే వాళ్లు. అప్పట్లో పెద్దగా తనిఖీలు లేకపోవడంతో ఇళ్ల పెరట్లో గంజాయిని సాగు చేసేవాళ్లు. వ్యాపారం చేసేందుకు కాకుండా మత్తు కోసం దీనిని ఉపయోగించే వాళ్లు. ప్రస్తుతం కాలం మారింది. విద్యార్థులు, యువకులు గంజాయికి బానిసలు అవుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కంట్రోల్‌ చేయడం కష్టమని భావించిన సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి గంజాయి సాగును, రవాణాను నివారించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంట పొలాల్లో ఎక్సైజ్‌ పోలీసులు, క్రమం తప్పకుండా పోలీసులు తనిఖీలు చేయడంతో ఇక్కడ కొంతమేర కంట్రోల్‌ అయ్యింది. కాకపోతే పక్క రాష్ట్రం నుండి పెద్దఎత్తున రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.

స్మగ్లింగ్‌లో మహిళల భాగస్వామ్యం..

గంజాయి స్మగ్లింగ్‌లో నేరుగా మహిళలు పాల్గొన్న దాఖలాలు చాలా అరుదు. పోలీసుల తనిఖీలు పెరిగిపోవడంతో స్మగ్లర్లు ఇందులో మహిళలను భాగస్వాములను చేస్తున్నారు. గతంలో నేరుగా మహిళలు పాల్గొన్న సందర్భాలు చాలా అరుదు. పెద్దఅంబర్‌పేట అవుటర్‌రింగ్‌రోడ్డు పై హయత్‌నగర్‌ పోలీసులు ఏకంగా 470 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం. వాహనాల్లో మహిళలుంటే పెద్దగా తనిఖీ చేయరనే నమ్మకంతో స్మగ్లర్లు మహిళలను భాగస్వాములను చేశారు. ఎక్కువ కమీషన్‌ ఆశచూపి మహిళలను భాగస్వాములను చేశారు. తూర్పుగోదావరి జిల్లానుండి కార్లలో 470కిలోల గంజాయిని కార్లలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పక్కా సమాచారంలో హయత్‌నగర్‌ పోలీసులు పెద్దఅంబర్‌పేట వద్ద కార్లనుండి మరో కార్లలోకి గంజాయిని మార్చుతుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం. వీరికి ఎక్కువ కమీషన్‌ ఆశచూపి స్మగ్లింగ్‌లో భాగస్వాములను చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ఇప్పటికే పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

ఆంధ్రా టు మహారాష్ట్ర వయా హైదరాబాద్‌..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌నుండి వివిధ ప్రాంతాలనుండి గంజాయిని మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. వయా హైదరాబాద్‌ మీదుగా తరలిస్తున్నారు. ఈ వ్యాపారం చాలారోజులుగా కొనసాగుతున్నా ఇటీవలి కాలంలో వ్యాపారం పెరిగిపోయింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు పెరిగిపోవడంతో అడ్డంగా దొరికిపోతున్నారు. మహారాష్ట్రకు పెద్దఎత్తున గంజాయిని సరఫరా చేస్తున్నారు స్మగ్లర్లు. హైదరాబాద్‌ మీదుగా అక్కడికి తరలిస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం సీనియస్‌గా ఉండటంతో పోలీసులు తనిఖీలు పెంచారు. దీంతో పెద్దఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధుల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నారు. ఈ జంట కమిషనరేట్ల పరిధిలో పెద్దఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. గంజాయి ఎక్కువగా వచ్చే ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలనుండి నేరుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పక్క రాష్ట్రంలో గంజాయి సాగును కంట్రోల్‌ చేస్తేనే అక్రమ రవాణాకు బ్రేకులు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement