Sunday, April 14, 2024

Vijayashanthi: మ‌త్తులో చిత్త‌వుతున్న యువ‌త‌.. కేసీఆర్ స‌ర్కార్ మొద్దు నిద్ర

హైదరాబాద్ నగరం గంజాయికి అడ్డాగా మారిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. న‌గ‌రంలో ఎక్క‌డబడితే అక్క‌డ గంజాయి దొరుకుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిపారు. గ‌తంలో డ్రగ్స్ పై హ‌డావిడి చేసిన పోలీసులు ఇప్పుడు చోద్యం చూస్తున్నారు అని విమర్శించారు. పోలీసుల‌తో పాటు ప్ర‌భుత్వం కూడా దీని గురించి ప‌ట్టించుకోవ‌డం లేదన్నారు. డ్రగ్స్‌తో పాటు గుట్టు చ‌ప్పుడు కాకుండా బెల్ట్ షాపులు కూడా నిర్వ‌హిస్తున్నారని ఆరోపించారు. బెల్ట్‌ షాపులు, గుడుంబా బస్తీల్లోని పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుట్టుగా గంజాయి సరఫరా అవుతుండడంతో యువత నిత్యం మత్తులో మునిగి తేలుతున్నారని అన్నారు.

గతంలో మద్యం మత్తులో అనేక హత్యలు, కొట్లాటలు జరిగినా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రీ పగలు అనే తేడా లేకుండా బెల్ట్‌షాపులు తెరిచి ఉండడం, విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతుండడంతో యువత మత్తులో మునిగి తేలుతున్నారని తెలిపారు. పాపిరెడ్డి కాలనీలో ఇటీవల ఓ బెల్ట్‌షాపులో మద్యం తాగిన యువకుడిని అతి దారుణంగా హత్య చేశారని గుర్తు చేశారు. ఇక్కడ బెల్డ్‌ షాపు వల్ల నిత్యం యువకుల మధ్య, భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఎక్కువయ్యాయని చెప్పారు. పలు సందర్భాల్లో ఇక్కడ అక్రమ మద్యం, గంజాయి, గుట్కా పట్టుబడి, కేసులు నమోదయ్యాయి అని పేర్కొన్నారు. అయినా పోలీసులు వీటిని అరికట్టడంలో విఫలమవుతున్నారని తెలిపారు. కాసులకు కక్కుర్తిపడి నెల మాముళ్ళు వసూలు చేస్తున్న కొందరు పోలీసుల వల్లే బెల్ట్‌షాపులు జోరుగా నడుస్తున్నాయని విజయశంతి ఆరోపించారు. ఇంత జ‌రుగుతున్నా కేసీఆర్ స‌ర్కార్ మొద్దు నిద్రపోతోందన్నారు. ఇప్పటికైనా అక్రమంగా మద్యం, గుండుంబా, గంజాయి విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల బ‌తుకుల‌తో ఆడుకుంటున్న కేసీఆర్ స‌ర్కార్‌ను ఈ ప్ర‌జ‌లే బంగాళాఖాతంలో కలప‌డం ఖాయం అని విజయశాంతి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement