Thursday, March 28, 2024

అంజ‌నాద్రే హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లం: టీటీడీ ఈవో

అంజ‌నాద్రే హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. హనుమ జ‌న్మ‌స్థ‌లం గురించి తమ వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను ఇప్ప‌టికే చూపామ‌ని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బగా తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హనుమంతుని జన్మస్థలంపై చోటు చేసుకొన్న వివాదాలు త్వరలోనే సర్దుమణుగుతాయన్నారు. అంజనాద్రిలో జపాలి, ఆకాశగంగ తీర్థాలు పక్క, పక్కనే ఉన్నాయన్నారు.

గోవిందానంద స్వామి ఏదేదో మాట్లాడుతున్నారని.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. గోవిందానంద సరస్వతీ స్వామి టీటీడీపై విమర్శకు పరిమితం అవుతున్నారని, ఆయన చూపిన ఆధారాలు సరిగా లేవని చెప్పారు. టీటీడీ త‌ప్పు చేస్తోంద‌న్న భావ‌న‌ ప్ర‌జ‌ల్లో క‌లిగేలా ఆయన మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. పురాణాలను కూడా ఆయన విశ్వసించడం లేదన్నారు. సరైన ఆధారాలుంటే ఎవరైనా తీసుకురావొచ్చని.. అంతేకాని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవద్దని పేర్కొన్నారు. తాము చూపుతున్న ఆధారాలకంటే బలమైన ఆధారాలు చూపితే అంజనాద్రి ఆంజనేయస్వామి జన్మస్థలంపై పునరాలోచిస్తామవి తెలిపారు. అప్పటివరకు అంజనాద్రే హ‌నుమంతుడి జన్మస్థానమని ఆయన స్పష్టం చేశారు.

కాగా, ఆంజ‌నేయ స్వామి జన్మస్థలంపై టీటీడీ చెప్పిన విష‌యాల్లో నిజాలు లేవ‌ని, హడావుడిగా ప్రకటన చేసింద‌ని హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే.

శేషాచలం కొండల్లోని అంజనాద్రియే ఆంజనేయుడి జన్మస్థానమని టీటీడీ పండితుల కమిటీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గత నెల 21న శ్రీరామనవమి రోజున తిరుమలలో ఆంజనేయుడి జన్మస్థానంపై పరిశోధన చేసిన కమిటీ ప్రకటించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలని కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ మురళీధర శర్మ కోరారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి స్వామి హనుమంతుడి జన్మస్థాన ప్రకటనపై తనకున్న అభ్యంతరాలతో టీటీడీకి ఓ లేఖ రాశారు. ఆంజనేయుడి జన్మస్థలంపై చర్చాగోష్టి నిర్వహించాలని కోరారు. గత నెల జాతీయ సంస్కృత వర్సిటీలో ఆంజనేయుడి జన్మస్థానం అంశంపై చర్చ జరిగిన  సంగతి విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement