Thursday, April 25, 2024

ఏపీ రోడ్లపై ప్రయాణం సర్కస్‌ ఫీట్లే.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ మూడు రోజుల పాటు తలపెట్టిన ‘గుడ్‌ మార్నింగ్‌ సీఎం సార్‌’ డిజిటల్‌ కాంపెయిన్‌కు విశేష స్పందన వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మొదలైన ఈ కార్యక్రమం సామాజిక మాధ్యమంలో విస్తృత ప్రచారంలో ఉంది. కార్యక్రమం మొదలు పెట్టిన రెండు గంటల వ్యవధిలోనే ట్విట్టర్‌లో లక్షా 66వేల ట్వీట్లు ముఖ్యమంత్రిని ట్యాగ్‌ చేస్తూ వచ్చాయి. ట్విట్టర్‌ సామాజిక మాధ్యమంలో మొదటి రెండు స్థానాల్లో ఇది కొనసాగుతోంది. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని ఫొటోలు, వీడియోలు తీసి సీఎంను ట్యాగ్‌ చేస్తూ ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లేలా జనసేన ప్రయత్నిస్తోంది. ఉదయం 8గంటల సమయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రోడ్డు దుస్థితిని పేర్కొంటూ, సీఎంను ట్యాగ్‌ చేస్తూ వీడియోను ట్విట్టర్‌ లో పెట్టారు. వీడియోలో కొత్తపేట వద్ద నున్న రహదారి పరిస్థితిని వివరిస్తూ వీడియోతో పాటు వ్యంగ్య చిత్రం పోస్టు చేశారు.

రాష్ట్రంలో రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలియచేసేలా ఉన్న వ్యంగ్య చిత్రాన్ని పవన్‌ కళ్యాణ్‌ పోస్టు చేశారు. హెలికాప్టర్‌లో వెళ్తున్న సీఎం రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళను వింతగా చూడటం, ఒక్కో గోతిలో నుంచి గాల్లో ఎగిరి అంతా దూరాన ఉన్న మరో గోతిలో ఉన్న నీళ్ళలో పడుతుంటే వ వాహనాలు గాల్లో ఉన్నట్లు- ఆ వ్యంగ్య చిత్రం ఉంది. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్నవారిని పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఆ కార్టూన్‌ తెలియచేస్తుందని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. జనసేన చేపట్టిన ఈ కార్యక్రమం ట్విట్టర్‌ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో సైతం ట్రెండింగ్‌లో ఉందని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement