Thursday, April 25, 2024

ఎస్సీ మహిళలకు వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ, 136 కోట్లతో నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు ఆర్టీసీలో బస్సు డ్రైవర్లుగా నియమించడానికి అవసరమైన భారీ వాహనాల డ్రైవింగ్‌ లో శిక్షణ ఇవ్వనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26జిల్లాల్లో 320 మహిళలకు శిక్షణ ఇస్తామని, శిక్షణానంతరం వీరందరికీ బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలను పొందే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా చేపడుతున్న పథకాలను బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి నాగార్జున సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టీసీలో ఎస్సీ మహిళలకు రిజర్వ్‌ చేసిన 320 డ్రైవర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అవన్నీ కూడా శిక్షణానంతరం ఎస్సీ మహిళలకు వచ్చేలా చూస్తామని మేరుగు నాగార్జున వివరించారు. డ్రైవింగ్‌ తో పాటుగా కార్పొరేట్‌ ఆస్పత్రుల ద్వారా మహిళలకు నర్సింగ్‌ లోనూ శిక్షణలు ఇస్తామని తెలిపారు.

రూ.136 కోట్లతో ఎస్సీ నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పిఎం అజయ్‌ పథకం కింద ఈ ఏడాది రూ.136 కోట్లతో పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని మంత్రి నాగార్జున చెప్పారు. ఈ పథకంలో భాగంగానే ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఆదాయం అభివృద్ధి చెందే కార్యక్రమాలను చేపడతామన్నారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ లో భాగంగా పలు వృత్తి విద్యలలో శిక్షణలు ఇస్తామని, ఈ శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు లభించేలా చూస్తామన్నారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ లో భాగంగానే ఎస్సీ మహిళలకు భారీ వాహనాల డ్రైవింగ్‌ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు … పిఎం అజయ్‌ పథకంలో భాగంగానే ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూములలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపడతామని వివరించారు. ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.డీ.సీ, ఎన్‌.ఎస్‌.కే.ఎఫ్‌.డీ.సీ, భూమి కొనుగోలు (ఎల్పీఎస్‌) తదితర పథకాలకు సంబంధించిన ప్రగతిని ఈ సందర్భంగా సమగ్రంగా సమీక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement