Saturday, April 20, 2024

నిమ్మ ధ‌ర త‌గ్గింది, అమాంతం ప‌డిపోయిన రేటు.. కిలో 40 మాత్ర‌మే

అమరావతి, ఆంధ్రప్రభ : నిన్నటి వరకు నింగి వైపు చూసిన నిమ్మ నేడు నేలవైపు చూస్తోంది. ఈ నెలారంభంలో అత్యధికంగా కిలో రూ.190 పలికిన నిమ్మ ధరలు ఒక్కసారిగా అమాంతం పడిపోయి ప్రస్తుతం రూ. కిలో 40కి క్షీనించింది. నెలాఖరుకు మరింత పతనం అయ్యే అవకాశా లు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో నిన్నటి వరకు ఆశాజనకంగా నిమ్మ రైతులు.. ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో డీలా పడిపోయారు. రాష్టంలో ప్రధాననంగా నిమ్మపంట నెల్లూరు జిల్లాలో అత్యధికంగా పండిస్తుండగా ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు తరువాత స్థానంలో వున్నాయి. రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, కర్నూలు జిల్లాలో ఒక మోస్తరుగా పంట వుంది. రాష్టంలో నెల్లూరు జిల్లా గుడూరు, గుంటూరు జిల్లా తెనాలి, ఏలూరు నిమ్మ క్రయ విక్రయాలకు ప్రధాన మార్కెట్లుగా వున్నాయి. ఇక్కడ నుంచి ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీ, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్టాలకు నిమ్మ ఎగుమతి అవుతుంది. అయితే ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గిపోవడంతో నిమ్మధరలకు రెక్కలు వచ్చాయి.

సాధారంగా ఎకరాకు వంద టిక్కిల దిగుబడి వస్తుంది. అయితే ఈ సంవత్సరం కేవలం 20టిక్కిలు మాత్రమే రావడంతో ఉత్పత్తి తగ్గి గిరాకీ ఏర్పడింది. దీనికి తోడు మార్చి నెల మధ్య నుంచి దేశావ్యాప్తంగా మే 15వరకు ఎండలు మండిపోవడంతో నిమ్మ వినియోగం పెరిగి ధరలు క్రమేణా పెరుగుతూ వచ్చాయి. అయితే మే నెల 15 తరువాత దేశ వ్యాప్తంగా వర్షాలు పడడంతో నిమ్మ వినియోగం క్రమేణా తగ్గడంతో ధరలు తగ్గు మొహం పట్టాయి. ధరలు తగ్గిపోవడంతో నష్టాలు మూటగట్టు-కోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కౌలు రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు లక్ష ఎకరాల్లో రైతులు నిమ్మ సాగు చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లకు రోజుకు సుమారు వెయ్యి లారీల సరుకు వస్తుంది. అయితే , ధర నిలకడగా ఉండడం లేదు. పంట మార్కెట్లోకి రానప్పుడు ధర ఎక్కువగా ఉంటోంది. పంట మార్కెట్‌కు వచ్చేసరికి వ్యాపారులు సిండికెట్‌గా ఏర్పడి ధర భారీగా తగ్గించేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement