Saturday, April 20, 2024

ఏపీలో రాజకీయ వేడి.. లోకేశ్ పర్యటనపై హై టెన్షన్

విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నరసరావుపేట పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించాలని లోకేశ్‌ నిర్ణయించారు. అయితే, లోకేశ్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్‌ దృష్ట్యా లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. విమానాశ్రయం పరిసరాలు, జాతీయ రహదారిపై కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి విమానాశ్రయం వరకు చెక్‌పోస్టులు పెట్టారు. టీడీపీ నేతలు విమానాశ్రయం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు.

ఈ క్రమంలో గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి నారా లోకేష్‌ను చూసేందుకు వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. మరోవైపు లోకేష్ పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతల ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.  గన్నవరంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు నరసరావుపేటలో మహాధర్నాకు టీడీపీ పిలుపునిచ్చింది. గుంటూరులో రమ్య హత్య జరిగి 21 రోజులైనా శిక్ష వేయలేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయం వద్ద పోలీసుల మోహరించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ చదలవాడ అరవిందబాబు, సత్తెనపల్లిలో కోడెల శివరామ్‌ను గృహనిర్బంధం చేశారు. గుంటూరులో టీడీపీ నేత ఆలపాటి రాజా గృహనిర్బంధం చేశారు. నరసరావుపేట లోకేశ్ పర్యటనకు వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు విధించారు. గుంటూరు రింగ్‌రోడ్డులో నివాసం వద్ద రాజాను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు ఆలపాటి రాజా.

ఇది కూడా చదవండి: మద్యంపై ఉద్యమం చేయడమేంటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement