Thursday, April 25, 2024

స‌భా కార్య‌క్ర‌మాల‌కు ఆటంకం – 12 మంది టిడిపి స‌భ్యుల సస్పెన్ష‌న్

అమరావతి: ఏపీ అసెంబ్లీ స‌భాకార్య‌క్ర‌మాల‌కు ప‌దేప‌దే అడ్డుత‌గులుతుండ‌టంతో 12 మంది టిడిపి స‌భ్యుల‌ను స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.. వారిలో ప‌య్యావుల కేశవ్,నిమ్మ‌ల రామ‌నాయుడిని ఈ సెష‌న్ మొత్తం నుంచి బ‌హిష్క‌రించ‌గా, మిగిలిన 10మందిని ఒక‌రోజు స‌స్పెండ్ చేశారు..కాగా స‌భ‌లో త‌న నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర‌రెడ్డిని సైతం ఈ సెష‌న్ మొత్తం నుంచి బ‌హిష్క‌రించారు.. హౌస్‌ను మిస్ లీడ్ చేసినందుకు, సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అంతకుముందు కేవలం ఇద్దరు టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును మాత్రమే స్పీకర్ సస్పెండ్ చేశారు. గవర్నర్ రిసీవింగ్ అంశంపై సభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తనకు అవకాశం కల్పించాలని పదే పదే అడిగారు. సుమారు 40 నిమిషాలకు పైగా సభలో అధికారపార్టీ మంత్రులు, సభ్యులు మాట్లాడుతున్న సమయంలో పయ్యావుల అడ్డు తగిలారు. ఈ క్రమంలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేకుండా తమరెలా సస్పెండ్ చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. దీంతో అప్పటికప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మరలా వీరిద్దరిని సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు వినతి చేశారు. అప్పుడు స్పీకర్ మరోసారి ఇద్దరు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెండ్ అయిన వారు సభ నుంచి బయటకు వెళ్లాలని కోరినప్పటికీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేస్తేనే వెళతామని అంటున్నారని వీరి మొత్తాన్ని సస్పెండ్ చేస్తే తప్ప సభను జరగనివ్వరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సభ్యులను అందరిని సస్పెండ్ చేయాలని మరో మంత్రి దాడిశెట్టి రాజా స్పీకర్‌కు తెలిపారు. దీంతో గంప‌గుత్త‌గా అంద‌ర్ని స‌స్పెండ్ చేశారు స్పీక‌ర్..

స‌స్పెండ్ అయిన వారిలో టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవని, చినరాజప్ప, గణబాబు, పయ్యవుల కేశవ్, గద్దె రామ్మెహన్, రామరాజు, ఏలూరి సంబశివరావు, డోలా వీరాంజనేయస్వామి, రవికుమార్‌లతో పాటు కోటంరెడ్డి శ్రీధ‌ర రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement