Friday, March 29, 2024

ఆనందయ్య బీసీ కాబట్టే నిర్బంధించారా?: సోమిరెడ్డి

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ కమిషనర్, స్టేట్ హెల్త్ సెక్రటరీ ప్రకటించినా…పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ఆనందయ్య బీసీ కాకుండా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయివుండుంటే ఇన్ని రోజులు అక్రమంగా నిర్బంధించేవారా అని ధ్వజమెత్తారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్ ఫౌండేషన్ బిల్డింగ్ లో అనధికారికంగా వేలాది మందికి తయారు చేయించుకుంటారా ? అంటూ మండిపడ్డారు.

పేదలకు మాత్రం మందు పంపిణీ ఆపేసి పెద్దోళ్లకు మాత్రం ప్యాకెట్లు చేసి పంపిస్తున్నారని ఆరోపించారు. ఎంతో సౌమ్యుడైన ఆనందయ్య తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ 40 ఏళ్లుగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ కు సంబంధించి కూడా 70 వేల మంది వరకు మందు తీసుకుంటే ఏ ఒక్కరూ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడే కాదు 40 ఏళ్లలో ఎప్పుడూ ఆనందయ్య మందు గురించి ఒక్క ఫిర్యాదు కూడా లేదన్నారు. మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ కమిషనర్ రాములు ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారన్నారు. పేదలకు ఉచితంగా సేవ చేస్తున్న బీసీ వర్గానికి సంబంధించిన ఆనందయ్యను అనధికారికంగా నిర్బంధించడం బాధాకరం అని పేర్కొన్నారు. ఆనందయ్య అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇలా నిర్బంధించగలిగే వారా? అని ప్రశ్నించారు. ఆయనను నిర్బంధించడం న్యాయం కాదని, వెంటనే ఆయనకు స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. మందు పంపిణీ విషయంలోనూ వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. మందుపై అనుమానం ఉన్నవాళ్లు దానిని వాడవద్దని సోమిరెడ్డి హితవు పలికారు.

ఇది కూడా చదవండి: జంతువులపై ఆనంద‌య్య మందు ప్రయోగం

Advertisement

తాజా వార్తలు

Advertisement