Friday, April 26, 2024

Delhi: ఏపీకి తగినంతగా ఎరువులు స‌ప్ల‌య్‌ చేయండి.. కేంద్రమంత్రికి ఎంపీ లావు వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్ కేటాయింపులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎరువులు, యూరియా సరఫరా చేయాలని వైఎస్సార్సీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన న్యూఢిల్లీలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సూక్ మాండవీయాను కలిశారు. ఈమేరకు రాష్ట్రానికి ఎరువుల సరఫరాపై వినతిపత్రం సమర్పించారు.

ఖరీఫ్‌లో ప్రధాన పంటలైన వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగు చురుగ్గా సాగుతోందని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో డీఏపీ అవసరం ఉందని వివరించారు. రాష్ట్రంలో ఉన్న 19,616 మెట్రిక్ టన్నుల లోటును తీర్చేందుకు సీఎఫ్‌సీఎల్ ద్వారా 14 వేల మెట్రిక్ టన్నులు, గ్రీన్ స్టార్ ద్వారా 5,616 మెట్రిక్ టన్నుల ఎరువులను రాష్ట్రానికి అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు చురుగ్గా సాగుతున్నందున రైతుల తక్షణ అవసరాలను తీర్చేందుకుగాను కృష్ణపట్నం, కాకినాడ, వైజాగ్‌ పోర్టుల ద్వారా డీఏపీని సరఫరా చేయాలని శ్రీకృష్ణదేవరాయలు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement