Saturday, April 20, 2024

ఏపీలోని స్కూళ్లపై కరోనా పంజా.. వైరస్ బారిన పడిన విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలోని స్కూళ్లలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇటీవల పాఠశాలలు తెరుచురకున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారు. వ్యాక్సిన్‌ వచ్చి కరోనా తీవ్రత తగ్గుతుందని అంతా ఆశిస్తున్న వేళ మళ్లీ కేసులు పెరుగుతుండడం కలవరపాటుకు గురి చేస్తోంది. 

కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతబడిన పాఠశాలలు  వారం రోజుల క్రితం తెరుచుకున్నాయి. అయితే స్కూళ్లు పునఃప్రారంభమైన వారం రోజులకే విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని డీఆర్ఎం మున్సిపల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థు ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

మరోవైపు కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్థానిక ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. శుక్రవారం పాఠశాలలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. సోమవారం వచ్చిన ఫలితాల్లో పది మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.

చిత్తూరు జిల్లాలోని ఓ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు వైరస్ సోకింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం కాపుగున్నేరి పంచాయతీ పరిధిలోని ఎంఎంసీ కండ్రిగలోని ప్రాధమిక పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థినులకు కొవిడ్ సోకింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు తెరిచిన వారం రోజుల్లోనే పిల్లలకు వైరస్ సోకడం గమనార్హం.

- Advertisement -

ఇది కూడా చదవండిః ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఒక్కో అకౌంట్లో రూ.20 వేలు జమ

Advertisement

తాజా వార్తలు

Advertisement