Wednesday, April 24, 2024

KNL: సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత.. ఎస్పీ కృష్ణకాంత్

కర్నూల్ ప్రతినిధి : సీఎం ప‌ర్య‌ట‌న‌కు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేస్తున్నామ‌ని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు.వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం సంద‌ర్భంగా జిల్లా లోని పత్తికొండకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రానున్న నేపథ్యంలో పత్తికొండ సెయింట్ జోసెఫ్ హైస్కూల్ లో బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసులకు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ పలు సూచనలు, సలహాలు చేసి దిశానిర్దేశం చేశారు. ఈసంద‌ర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… పత్తికొండ లో ముఖ్యమంత్రి పర్యటించే రూట్ అండ్ రూఫ్ – టాప్ ప్రాంతాలలో, సిఎం కాన్వాయ్, హెలిపాడ్, బహిరంగ సభ సమావేశ ప్రాంగణం, తదితర ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు, పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రత పరంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. సున్నితంగా వ్యవహరించాలన్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. చేయకూడనవి, చేయవలసిన వాటి గురించి తెలిపారు. అనంతరం సిఎం కాన్వాయ్ రిహార్సల్స్ ను, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి బహిరంగ సభ వద్ద భద్రత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ కలిసి పరిశీలించారు. న‌లుగురు అడిషనల్ ఎస్పీలు, 19 మంది డీఎస్పీలు, 57మంది సిఐలు, 119మంది ఎస్సైలు, 473 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్ళు , 815 మంది కానిస్టేబుళ్ళు, 70 మంది మహిళా పోలీసులు, 396 మంది హోంగార్డులు, 02 సెక్షన్ల ఏ ఆర్ సిబ్బంది, 02 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు. జిల్లా ఎస్పీతో పాటు సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement