అమరావతి, ఆంధ్రప్రభ: తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 20 కి .మీ వేగంతో వాయువ్య దిశగా కదిలి ఆదివారం పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీద , ఉత్తర అక్షాంశం 15.6డిగ్రీలు మరియు తూర్పు రేఖాంశం 88.4 డిగ్రీల వద్ద ,దాదాపు పోర్ట్ బ్లెయిర్కు వాయువ్యంగా 640 కి.మీ, సాగర్ ద్వీపానికి దక్షిణాన 670 కి.మీ మరియు బారిసాల్ (బంగ్లాదేశ్).కు దక్షిణ – నైరుతి దిశలో 820 కి.మీ. దూరం లోను కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇది వచ్చే 12 గంటల్లో వాయువ్య దిశగా కదిలి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఎక్కువగా ఉందని, ఆ తర్వాత, వంపు తిరిగి ఉత్తర- ఈశాన్యం వైపు కదిలి ఈనెల 25 తేదీ ఉదయానికి బంగ్లాదేశ్ తీరాన్ని టింకోనా ద్వీపం మరియు శాండ్విప్ మధ్య బారిసల్కు దగ్గరగా దాటుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయని, ఆంధ్ర ప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర మరియు ఈశాన్య గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా రాగల 48 గంటల్లో ఉత్తర, దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.