Thursday, April 25, 2024

ఏప్రిల్‌ 3 నుంచి 5వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల,ప్రభన్యూస్‌ ప్రతినిధి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 3 నుంచి 5 వ తేది వరకు మూడురోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ద పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడురోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్‌ 3 వ తేది ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ వసంతోత్సవం, అభిషేక నివేధనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఇక రెండవరోజు 4 వ తేదిన శ్రీభూ సమేత శ్రీమలయప్పస్వామివారు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడవీధులలో ఊరేగుతారు.

- Advertisement -

అనంతరం వసంతమండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్‌ 5 న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులు వసంత వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్శంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.

కాగా ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత రుతువులో శ్రీమలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవ మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంద పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేధించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్‌ 4 న అష్టదళపాదపద్మారాధన, ఏప్రిల్‌ 3 నుంచి 5 వ తేది వరకు కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement