Monday, April 15, 2024

జిల్లాలో ముమ్మరంగా ఫీవర్ సర్వే .. కలెక్టర్ నివాస్


శ్రీకాకుళం, : జిల్లాలో ముమ్మరంగా ఫీవర్ సర్వే నిర్వహించడం జరుగుతోంది. కరోనా కట్టడికి ఫీవర్ సర్వేను జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు మండల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే కార్యక్రమం జరుగుతోంది. ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని జల్లెడ పట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జ్వరం, దగ్గు, జలుబుతో సహా ప్రస్తుతం కరోనా లక్షణాలుగా మారుతున్న కీళ్ళ నొప్పులు, నడుం నొప్పి, నీరసం, విరేచనాలు, తల నొప్పి, కళ్ళు ఎర్రగా మారడం (కళ్ళ కలక మాదిరిగా) వంటి లక్షణాలు కనిపిస్తే వారిని గుర్తించి నమూనాలు సేకరించాలని కలెక్టర్ సూచించారు. కంటైన్మెంటు జోన్లలో జిల్లా కలెక్టర్ సందర్శిస్తున్న సమయంలో సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. మండలాల్లో ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రతి ఇంటిలో పరిస్ధితిని తెలుసుకుంటున్నారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించిన పరీక్షలు చేయించుటకు సహకరిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహించేది ముందుగా సమాచారం అందించడం జరుగుతోంది. ఫీవర్ సర్వేలో మండల ప్రత్యేక అధికారులతోపాటు జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి మరియు జిల్లా నోడల్ అధికారి క్షేత్ర స్ధాయిలో పర్యటిస్తున్నారు. ఫీవర్ సర్వే స్ధితిగతులను పరిశీలించడమే కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఫీవర్ సర్వే ఒక ప్రక్క చేపడుతుండగా మరో వైపు పారిశుధ్య కార్యక్రమాలను కూడా విస్తృతం చేపడుతున్నారు. వైరస్ నాశనానికి అవసరమైన బ్లీచింగ్, హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి వంటి వివిధి పద్ధతులను ఆచరిస్తున్నారు.
కంటైన్మైంట్ ప్రాంతాలపైనా దృష్టి సారించి కరోనా కేసులు నివారణకు గట్టి చర్యలు చేపడుతున్నారు. మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులతోపాటు మునిసిపల్ కమీషనర్లు ఈ మేరకు అన్ని చర్యలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement