Wednesday, April 24, 2024

ఒడిశాలో అడుగుపెడితే 14 రోజుల క్వారంటీన్

శ్రీకాకుళం, : ఒడిషా రాష్ట్రంలోకి ప్రవేశిస్తే 14 రోజుల క్వారంటీన్ ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు గురు వారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల నుండి ఒడిషాలోకి ప్రవేశించే వారికి 14 రోజుల సంస్ధాగత క్వారంటీన్ విధిస్తూ ఒడిషా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కొరాపుట్ జిల్లా కలెక్టర్ తెలిపారని ఆయన వివరించారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల సరిహద్దు జిల్లాలైన గంజాం, గజపతి, రాయగాడ, కొరాపుట్, మల్కన్ గిరి, నౌరంగపూర్ జిల్లాలలో సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్రంలోకి ప్రవేశించే చిన్నా, పెద్దా అన్ని మార్గాలలో నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఒడిషా రాష్ట్రంలోని స్దానిక సంస్ధలకు కూడా దీనిపై తగు సమాచారం ఉందని కలెక్టర్ పేర్కొంటూ జిల్లా నుండి ఒడిషాకు వెళ్లే వారు ఒడిషా ప్రభుత్వ నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. రెండు డోసుల టీకా వేసుకుని, ఒడిషాలోకి ప్రవేశించుటకు 48 గంటలకు ముందు ఆర్ టిపిసిఆర్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ రిపోర్టు చూపించినవారికి 7 రోజుల హోమ్ క్వారంటీన్ విధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించినవారిపై విపత్తుల నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 51 నుండి 60 వరకు నిబంధనలు, ఎపిడమిక్ డిసీజ్ చట్టం 1897, ఐపిసి సెక్షన్ 188 క్రిందా శిక్షార్హులని ఒడిషా ప్రభుత్వం తెలియజేసిందని కలెక్టర్ చెప్పారు. ఒడిషా మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఒడిషాలో ఎక్కడా ఆగకుండా వెళ్ళుటకు అవకాశం కల్పించారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement