Friday, March 29, 2024

మిర్చి ధరల ఘాటు..చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌, స్వీడన్‌ దేశాల నుంచి ఆర్డర్లు..

అమరావతి, ఆంధ్రప్రభ : మార్కెట్లో మిర్చి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మిర్చి మార్కెట్‌ లో మున్నెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు నమోదవు తున్నాయి. గతేడాది వైరస్‌ వల్ల దేశ వ్యాప్తం గా పంట దెబ్బతినడంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. దీంతో కొత్త వుత్పత్తుల మార్కెట్‌ ప్రారంభంలోనే నాణ్య మైన మిర్చి రకాలు క్వింటాలు రూ.18 వేలనుంచి ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి ధరల పెరుగుదల కొనసాగుతూనే వుంది. ప్రస్తుతం విదేశాల నుంచి భారీగా కొనుగోలు ఆర్డర్లు రావడంతో నాణ్యమైన మిర్చి రకాలకు విపరీతమైన గిరాకీ వచ్చింది. దీంతో మిర్చి ధరల పెరుగుదల గత కొన్ని రోజులుగా కొనసాగుతోంది. ఆసియా ఖండంలో అతిపెద్ద మిర్చి యార్డుగా గుర్తింపు పొందిన గుంటూరు మిర్చి యార్డులో శుక్ర వారం రికార్డు స్థాయిలో కొన్ని రకాల మిర్చి ధరలు పెరిగాయి. 2043 బాడిగ రకం మిర్చి క్వింటాలు రూ.33 వేలు పలికింది. గత ఇంత ధర ఎప్పుడూ లభించలేదని వ్యాపార వర్గాలు తెలిపాయి. వేసవి సెలవులకు ముందు రూ.18 వేలులోపు పలికిన వివిధ రకాల మిర్చి ధరలు సీజన్‌ ముగిసిన తరువాత భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో గరిష్టంగా క్వింటాలు రూ. 29 వేల నుంచి రూ.33 వేల వరకు పలుకుతున్నాయి. అయితే, ధరల పెరుగుదల వల్ల వ్యాపారు లకు, తప్ప రైతులకు కలిగే ప్రయోజనం స్వల్పంగా ఉంది. చైనా, వియత్నాం, బంగ్లా దేశ్‌, స్వీడన్‌ తదితర దేశాల నుంచి మిర్చికి ఆర్డర్లు వచ్చినట్లు- వ్యాపారులు చెబుతున్నా రు. దీంతో ధరలు మరింతగా పెరిగాయి. ఇప్పటి వరకు మిర్చిని నిల్వ చేసిన వ్యాపారు లకు బాగా కలసి వచ్చింది. వేసవి సెలవులకు ముందు వచ్చిన ధరల కన్నా ఇప్పుడు క్వింటాలుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అధిక ధరలు లభిస్తున్నాయి. కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన వ్యాపారులు, కొంత మంది రైతులకు ఇప్పుడు బాగా లబ్ధిపొందు తున్నారు. గుంటూరు జిల్లాల్లోని కోల్డ్‌ స్టోరేజిల్లో ప్రస్తుతం 40 లక్షల వరకు మిర్చి టిక్కిలు నిల్వ ఉన్నాయి. ఇందులో 30 లక్షల టిక్కిలు వ్యాపారులకు, మిగిలినవి రైతులకు సంబంధించినవని సమాచారం.

రైతులకు వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టే వ్యాపారులు ముందస్తు అవగాహన కుదుర్చుకుని రైతుల పేరున కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేయడం జరుగుతుంది. నాన్‌ ఎసి కామన్‌ వెరయిటీ సగటు ధర క్వింటాలు గరిష్టంగా రూ. 25,500 వేలు పలికింది. నాన్‌ ఎసి స్పెషల్‌ వెరయిటీ సగటు ధర రూ.26 వేలు వచ్చింది. ఎసి కామన్‌ వెరయిటీ గరిష్ట ధర రూ.25,500 పలికింది. ఎసి స్పెషల్‌ వెరయిటీకి క్వింటాలుకు రూ.25 వేలు ధర వచ్చింది. మిర్చిలో అత్యధిక డిమాండ్‌ ఉన్న తేజ, బాడిగ రకాలు రాష్ట్రం లో పండిన వాటికి మాత్రం క్వింటాలు రూ.30 వేల నుంచి రూ.33వేల వరకు పలికి నట్టు వ్యాపారులు చెబుతున్నారు. 355 బాడిగ రకం మిర్చి గరిష్టంగా రూ.29,500 వేలు పలకగా, 341 బెస్టు రకం క్వింటాలు రూ.29,000కు కొనుగోలు చేశారు. 2043 బాడిగ రకం మిర్చికి రూ.33 వేలు, సీజెంటా బేడిగ రకం మిర్చికి రూ.29 వేలు వరకు ధర లభించింది. నెంబరు 5 డీలక్స్‌ రకానికి రూ.27,500, దేవనారు డీలక్స్‌ రకం రూ.28,500 ధర వచ్చింది. తామర తెగులు తట్టుకుని నిలదొక్కుకున్న మిర్చి వెరయిటీలు గత రెండు నెలల క్రితమే యార్డుకు వచ్చాయి. రైతుల వద్ద గరిష్టంగా క్వింటాలు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు రూ.25 వేల నుంచి రూ.30 వేలకు పైగా విక్రయించుకుంటున్నారు. గుంటూరు మార్కెట్లో రిటైల్‌ ధర కిలో రూ.275 నుంచి రూ.350 వరకు పలుకుతోంది. మిర్చి ధరల పెరుగుదల రైతులు, వ్యాపారులకు లాభాల పంట పండిస్తుండగా .. సామాన్యులకు మాత్రం మంట మండిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement