Thursday, March 28, 2024

Breaking: తల్లి చేతిలో కొడుకు హతం.. తాగొచ్చి గోల‌చేస్తుంటే గొడ్డ‌లితో అటాక్‌..

ఇబ్రహీంపట్నం (ప్రభ న్యూస్): మద్యం మత్తులో వీరంగం వేసిన ఓ యువకుడు తల్లి చేతిలో హతమయ్యాడు. తల్లితో గొడవ పడి కొడవలితో తన తల్లి అనుకొని ఎదురింటి మహిళ చేతిపై నరికాడు. మత్తులో రోడ్డుపై పడిపోయిన కుమారుడిని తల్లి గొడ్డలితో నరికి చంపేసింది. ఈ ఘటన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కొటికలపూడిలో సోమవారం సాయంత్రం జరిగింది. కొటికలపూడికి చెందిన పప్పుల బాలకోటి (35) లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. పదేళ్ల క్రితం భార్యతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలతో కలిసి భార్య కంచికచర్లలో నివాసం ఉంటోంది. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని బాలకోటి కుమార్తెలు కొటికలపూడిలో నానమ్మ ఇంటికి వచ్చారు.

ఈ క్రమంలో సోమవారం మద్యం మత్తులో ఉన్న బాలకోటి తల్లి చిట్టెమ్మ, ఇద్దరు కుమార్తెలతో గొడవ పడ్డాడు. భయంతో వారు ఎదురింటికి వెళ్లారు. తల్లిని చంపేందుకు కొడవలితో వెళ్లిన బాలకోటి మత్తులో తన తల్లి అనుకుని ఎదురింటి మహిళ లింగమ్మ చేతిపై నరికాడు. అనంతరం రోడ్డుపై పడిపోయాడు. దీంతో ఆగ్రహం చెందిన తల్లి చిట్టెమ్మ గొడ్డలితో కొడుకు బాలకోటి మెడపై నరికి పరారైంది. తీవ్ర రక్తస్రావమైన అతన్ని, ఎదురింటి మహిళ లింగమ్మను 108లో వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. బాలకోటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇబ్రహీంపట్నం సీఐ కె.శ్రీధర్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement