Tuesday, April 23, 2024

సోమేశ్ కుమార్ కు పోస్టింగ్ ఖ‌రారు?

అమరావతి, ఆంధ్రప్రభ: తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు పోస్టింగ్‌ దాదాపు ఖరారైనట్లు తెలు స్తోంది. వాణిజ్యపన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సచి వాలయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు తగిన పదవి ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని సీనియర్‌ ఐఏఎస్‌లకు స్థాన చలనం కలగవచ్చని తెలుస్తోంది. ఈ వారంలోనే బదిలీలు వుండ వచ్చని తెలుస్తోంది. సోమేష్‌ కుమార్‌ హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేసారు. సీఎస్‌ జవహర్‌ రెడ్డికి రిపోర్టు చేసిన తరువాత ఏపీ సీఎం జగన్‌ తోనూ భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన సోమేశ్‌కు ఏ పోస్టు ఇవ్వాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘ కసరత్తు చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించి తాను ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసానని, పోస్టు చిన్నాదా పెద్దదా అనే ఆలోచన లేదని సోమేశ్‌ స్పష్టం చేసారు.

ఈ క్రమంలో తాజాగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపైన కసరత్తు చేసిన ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్టే. సోమేష్‌కు కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను, మరో ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు సంబంధించిన పోస్టింగ్‌ల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు- సమాచారం. పంచాయితీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గోపాలక్రిష్ణ ద్వివేదికి వ్యవసాయ శాఖ అప్పగించాలని నిర్ణయించారు. మరో అధికారి రాజశేఖర్‌కు పంచాయతీ రాజ్‌ శాఖ అప్పగించేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. వీరితో పాటు-గా మరికొందరు సీనియర్‌ అధికారుల పోస్టింగ్‌లపైన ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.
రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రాల మధ్య ఐఏఎస్‌ -ఐపీఎస్‌ అధికారుల విభజన జరిగింది. అందులో భాగంగా ఏపీకి కేటాయించిన సోమేశ్‌ కుమార్‌ క్యాట్‌ లో పిటీ-షన్‌ దాఖలు చేసి తెలంగాణలో కొనసాగారు. అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో హైకోర్టు తీర్పు వచ్చింది. సోమేశ్‌ను తెలంగాణ ఎలాట్‌ మెంట్‌ రద్దు చేస్తూ వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో, తెలంగాణలో రిలీవ్‌ అయిన సోమేశ్‌ ఏపీలో రిపోర్టు చేసారు. ఈ ఏడాది డిసెంబర్‌ వరకు సోమేశ్‌ సర్వీసులో కొనసాగనున్నారు. ఏపీలో రిపోర్టు చేసిన తరువాత పోస్టింగ్‌ కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు- తెలుస్తోంది. ఈ పోస్టింగ్‌ లకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement