Friday, April 26, 2024

షార్ లో తుపాకీ తో కాల్చుకుని ఎస్ఐ బలవన్మరణం 

సూళ్లూరు పేట (రాయలసీమ ప్రభ వెబ్ న్యూస్) : శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం (షార్) లో రాత్రి ఒక జవాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తరువాత ఒక ఎస్ఐ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జరిగింది. పోలీసుల కథ‌నం ప్రకారం ఉత్తర ప్రదేశ్ కు చెందిన వికాస్ సింగ్ మూడు నెలల క్రితమే శ్రీహరికోటలో ఎస్సైగా చేరారు.  సీఐఎస్ఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వికాస్ సింగ్ (35) రాత్రి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

తుపాకీ పేలిన చప్పుడు విన్న ఇతర సిబ్బంది వెళ్లి చూసి పోలీసులకు తెలియజేసారు. ఎస్సై వికాస్ సింగ్ కి ముగ్గురు పిల్లలు.. వీరు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు. నిన్న రాత్రి 8గంటల ప్రాంతంలో ఛత్తీస్ గఢ్ కు చెందిన చింతామణి అనే జవాన్ ఉరివేసుకుని మరణించిన ఘటన జరిగిన కొన్ని గంటలకే ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి తుపాకీతో కాల్చుకుని మరణించడం సంచలన చర్చనీయాంశమవుతోంది. ఈ రెండు కేసులను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సూళ్లూరు పేట ఎస్ఐ మనోజ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement