Thursday, April 25, 2024

జంగారెడ్డి గూడెం మృతులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలి: సోము వీర్రాజు

అమరావతి, ఆంధ్రప్రభ: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మృతులకు రూ.5లక్షలు పరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఓ వైపు మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్న తరుణంలో విషయం పక్కదారి పట్టించేలా ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందంటూ ఆయన మండిపడ్డారు. జంగారెడ్డి గూడెంలో ఇప్పటి వరకు 18మంది మృత్యువాత పడ్డారని, మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ, జంగారెడ్డి గూడెంకి చెందిన కొప్పాక వెంకటేశ్వరరావు (48), వేగేశ్న నాగ వెంకటసుబ్బరాజు (48), బంకూరి రాంబాబు (60), చిద్రాల పోశియ్య (35), బంగారు ఎర్రయ్య (65), చింతపల్లి సూరిబాబు (42), బండారు శ్రీను (49), దోసూరి సన్యాసిరావు (38), పులపర్తి సత్యనారాయణ (62), సలాది ఆనంద్‌ (43), పితాని రమణ (36), ముడిచెర్ల అప్పారావు (46), చంద్రగిరి శ్రీను (40), కాళ్ల దుర్గారావు (61), దేవరశెట్టి చక్రపాణి (64), వెంపల అనిల్‌ (35), సునాని ఉపేంద్ర (30), టి. నరసాపురం మండలం సింగరాయపాలేనికి చెందిన కూచింపూడి సత్యనారాయణ (40) ఉండగా మరికొందరు జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.

బాధిత కుటుంబాల సమాచారం ప్రకారం మృతులు, క్షతగాత్రులకు నాటుసారా తాగే అలవాటు ఉన్నట్లు తెలిసిందన్నారు. ఓ వైపు నాటుసారా బట్టీలపై దాడులు చేస్తున్నామని ప్రభుత్వం చెపుతుండగా అమ్మకాలు ఎలా జరుగుతున్నాయో స్పష్టం చేయాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దీనిపై వెంటనే సమాధానం చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఘటనకు కారణాలను గుర్తించి బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధిత కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని సోము వీర్రాజు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement