Friday, April 19, 2024

ఏపీలో రాక్షస పాలన.. ఉప్పినవలస ఘటనే ఉదాహరణ

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. సొంత బాబాయ్ హత్య జరిగిన తర్వాత వైఎస్ జగన్ రాజకీయాలు చేశారని  రామ్మోహన్నాయుడు ఆరోపించారు. ఇప్పుడు ఆయనను చూసే వైసీపీ కార్యకర్తలు కూడా అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉప్పినవలస ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.  ఉప్పినవలసలో పట్టపగలు కత్తులతో సినిమా స్టైల్లో దాడి చేశారని ఆరోపించారు. ఇలాంటి సంస్కృతిని శ్రీకాకుళం జిల్లాకు తీసుకొచ్చిన ఘనత స్పీకర్ తమ్మినేని సీతారాంకే దక్కిందని విమర్శించారు. ఆడవాళ్లను సైతం మృగాళ్లలాగా కత్తులతో నరికారని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థిని సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించినందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళంలోని టీడీపీ శ్రేణులందరినీ ఏకం చేసి పోరాడతామన్నారు. తమ్మినేని కొడుకు ప్రోత్సహించడం వల్లే దాడులని వైసీపీ కార్యకర్తలే చెబుతున్నారని విమర్శించారు. దాడులతో తమకు సంబంధం లేదంటూ తమ్మినేని సీతారాం తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. తమ్మినేనికి సంబంధం లేదంటే తమతోపాటు ఎస్పీ దగ్గరకు రావాలని రామ్మోహన్నాయుడు సవాల్ విసిరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement