Wednesday, April 24, 2024

వైసీపీపై రజినీ ఫ్యాన్స్ ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలన్న డిమాండ్

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై వైసీపీ నేతలు గత రెండు రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌, చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని రజనీ గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో వారిని పొగిడారు. దీంతో రజనీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. మంత్రి రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు తదితరులు కోలీవుడ్ సూపర్‌ స్టార్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజనీకి లేదని, ఆయన తమిళనాడులో హీరో కావొచ్చు గానీ ఇక్కడ కాదని, పక్క రాష్ట్రం నుంచి వచ్చి నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు రజనీకాంత్‌ అభిమానులను నొప్పించాయి. ఈక్రమంలో వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ను విమర్శించిన వారిపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో #YSRCPApologizeRajini అనే హ్యాట్‌ ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అవుతోంది. ‘రజనీ ఎన్టీర్‌, చంద్రబాబులతో తనకున్న అనుబంధంపై మాత్రమే మాట్లాడారు. ఆయన ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు కదా’ అంటూ అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. ఇదే క్రమంలో రజనీకాంత్ సినిమా లోని ఫేమస్‌ డైలాగులతో వైసీపీ నాయకులపై మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్‌ నెట్టింట వైరలవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement