Anantapur: అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లలో పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. తెల్లవారుజామున కొన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది. పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి చిత్రావతి డ్యాం నిండుకుండలా మారింది. పెద్దఎత్తున ప్రవాహం కొనసాగుతోంది.
ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వర్షపు నీరు శివారు కాలనీలను ముంచెత్తింది. 20 ఏళ్ల క్రితం చెరువు కట్ట తెగిపోయింది. నిన్న కురిసిన వర్షానికి ప్రవాహం ఎక్కువ కావడంతో ఆత్మకూరు ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ప్రవాహం రావడంతో ఆర్టీసీ బస్సు ఇరుక్కుంది. ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు.
ఈ రోజు తెల్లవారుజామున కూడా కొన్ని మండలాల్లో వర్షం కురిసింది. ధర్మవరంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. జిల్లాలో 63 మండలాలుండగా 12 మండలాల్లో ఒక మోస్తరు జల్లులు పడ్డట్టు అధికారులు తెలిపారు.