Thursday, April 25, 2024

Delhi | ఏపీలో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్.. డీపీఆర్ సిద్ధం చేస్తున్నామన్న రైల్వే శాఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళుతున్న ఈస్ట్ కోస్ట్ కారిడార్ ( ఖరగ్‌పూర్-విజయవాడ), నార్త్ సౌత్ సబ్ కారిడార్ ( ఇటార్సీ – విజయవాడ) కోసం ప్రత్యేక సరుకు రవాణా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( డీఎఫ్‌సీసీఎల్) ద్వారా సర్వే, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ రెండు కారిడార్‌లలో దేనినైనా రాష్ట్రానికి మంజూరు చేయడమనేది అక్కడి ట్రాఫిక్, సాంకేతిక, ఆర్థిక అంశాలపై ఆధారాపడి ఉంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా? అందుకు కేటాయించిన నిధులు, కారిడార్ ఏర్పాటుకు జరుగుతున్న జాప్యంపై వివరాలు అందించవలసినదిగా వైసీపీ ఎంపీ మారగాని భరత్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

కొత్త రైళ్ల ప్రతిపాదన లేదు..
కొత్త రైలు సేవలను ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొత్త రైళ్ల సేవలపై వైసీపీ ఎంపీలు డాక్టర్ సత్యవతి, గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. భారతీయ రైల్లు రాష్ట్రాల వారీగా రైలు సేవలను ప్రవేశపెట్టడం లేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. రైల్వే నెట్‌వర్క్ రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించి ఉన్నందున కొత్త రైలు సేవలను ప్రవేశపెట్టడం అనేది కార్యాచరణ, వనరుల లభ్యత, ట్రాఫిక్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన సమాధానంలో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement