ప్రభన్యూస్: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండల ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో గృహ నిర్మాణ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహన సదస్సు రసాభాసగా మారింది. ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో హౌసింగ్ డిఈ ఎమ్.జి.కె నాగరాజు అధ్యక్షతన మండల సర్పంచ్ లకు, ఎంపిటీసి లకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించేందుకు సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ వేదిక మీదకు ఎమ్మెల్యేతో పాటుగా స్థానిక జడ్పీటిసి, ఎంపిపి, వైస్ ఎంపిపి, ఎంపిడిఒ, తహసీల్దారు, హౌసింగ్ ఇఇ లను పిలిచి సదస్సును ప్రారంభించాలని గృహ నిర్మాణ శాఖవారు నిర్ణయించుకున్నారు. కానీ కార్యక్రమం ప్రారంభ సమయంలో నేదునూరు ఎంపిటీసి ఇండుగుల వెంకట్రామయ్య లేచి మేము ప్రజా ప్రతినిధులం కాదా అంటూ ప్రశ్నించడంతో సర్పంచ్ లను, ఎంపిటిసిలను కూడా వేదిక మీదకు రావాల్సిందిగా హౌసింగ్ డిఈ ఆహ్వానించారు.
అనంతరం కొద్దిసేపటికి సమావేశానికి విచ్చేసిన జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాస్ ను కూడా వేదిక మీదకు ఆహ్వానించారు. కానీ అక్కడ ఒక్క కుర్చీ లేకపోవడంతో ఆగ్రహంతో అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇదేనా ప్రజా ప్రతినిధులకు మీరిచ్చే గౌరవం అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీనికి సభాద్యక్షులు ఎవరు అంటూ డిఈని ప్రశ్నించడంతో ఆయన పొరబాటున ఎంపిడిఒ అని తెలిపారు. దీనితో జడ్పిటిసితో పాటుగా కొందరు అధికార వైసిపి నేతలు ఎంపిడిఒ పై ఏకవచనంతో సంభోధిస్తూ రెచ్చిపోయారు. నాకు సంబంధం లేదని ఆమె చెబుతున్న వివరణను సైతం వినకుండా మూకుమ్మడిగా వేదిక వద్ద ఎంపిడిఒ పై తీవ్ర స్వరంతో కేకలు వేస్తూ ఊగిపోయారు.
ఒకానొక దశలో ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. చేసేదేమీ లేక ఆమె కన్నీటిపర్యంతమవుతూ వేదిక వద్ద నుంచి వెళ్ళిపోయింది. అనంతరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వేదిక వద్దకు రావడంతో విషయం సద్దుమణిగి కార్యక్రమం సజావుగా సాగింది..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital