Saturday, April 20, 2024

అప్పుల ఊబిలో ఉన్నరైతులను కాపాడాలి: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు చోటు- చేసుకోవడం అత్యంత విషాదకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లా మేళ్లవాగుకి చెందిన మేడబోయిన రామకృష్ణ, నంద్యాల జిల్లా హరివరం గ్రామస్తుడు వెంకటేశ్వరరెడ్డి, కర్నూలు జిల్లా హోసూరుకి చెందిన ఉప్పర తిక్కయ్య పంట నష్టాలతో, అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. చిన్నపాటి కమతాలు ఉన్నా ప్రధానంగా కౌలు వ్యవసాయం మీద ఆధారపడిన ఈ రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన పరిహారాన్ని తక్షణమే అందించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. ఈ బాధ్యతను నెరవేర్చాల్సిన వ్యవస్థలు, సంబంధిత అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించకూడదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం త్రీ మెన్‌ కమిటీ సత్వరమే స్పందించాలని కోరారు. రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా వ్యవస్థలు పని చేయాలని, అయితే ఆ విధులు నిర్వర్తించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ నాయకత్వం ఎన్నికల సమయంలో ప్రతి రైతు కుటుంబానికి రూ. 50 వేలు పంట పెట్టు బడిగా ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ మేరకు ప్రచారం కూడా చేశారని పవన్‌ గుర్తు చేశారు.

ఆ హామీ మేరకు ఇప్పటి వరకూ ఎన్ని రైతు కుటుంబాలకు రూ. 50 వేలు చొప్పున పంట పెట్టుబడి ఇచ్చారని, అసలు ఆ హామీ ఏమైందని ప్రశ్నలు వేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. పంట అమ్ముకొన్నా సొమ్ములు చేతికి రాకపోవడం, తదుపరి పంటకు పెట్టుబడి లేక రైతులు ఇక్కట్ల పాలవుతున్నారని వివరించారు. కౌలు రైతులకు బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణాలు అందక ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి ఊబిలో కూరుకుపోతున్నారని, అలాంటి రైతులను అప్పుల భారం నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. పంటకు పెట్టుబడి ఇవ్వరని, రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకోరని, నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించరని, పండిన పంట తీసుకొని కూడా డబ్బులు ఇవ్వరని, అసలు ఏ దశలోనూ వైసీపీ రైతులకు అండగా నిలబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం చేసింది ఒక్కటే అన్నం పెట్టే రైతులకు కూడా కులాలవారీగా విభజించటమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ఇప్పటికే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకొనే దిశగా అడుగులు వేస్తోందని, గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న కౌలు రైతుల ఆత్మహత్యల ఘటనల్లో ప్రతి ఒక్కరికీ రూ. 7 లక్షల పరిహారం అందేలా పోరాడుతుందని స్పష్టం చేశారు. కౌలు రైతుల కుటు-ంబాలకు జనసేన పక్షాన భరోసా కల్పిస్తామని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement