Saturday, April 20, 2024

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. సచివాలయ ఉద్యోగులకు ప్రోబేషన్

రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రోబెషన్ ను అమలు చేస్తామని ఇప్పటికే సీఎం వైయస్ జగన్ ప్రకటించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ సచివాలయాల్లో ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారని, వారి పనితీరును గమనించిన సీఎం జగన్ వారికి జూన్ నెలలో ప్రోబెషన్ డిక్లేర్ చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ కావాలనే రాజకీయం చేస్తోందని, ఈ మధ్య కొంతమంది కార్యదర్శులను, సచివాలయ ఉద్యోగులను రెచ్చగొట్టారని అన్నారు. వారికి ప్రోబెషన్ ఇవ్వడం లేదని, జీతాలు పెంచడం లేదంటూ కొందరు నిరసనలు కూడా తెలిపారని అన్నారు. ఇదే క్రమంలో సీఎం వైయస్ జగన్ ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రోబెషన్ పై స్పష్టమైన ప్రకటన చేశారని చెప్పారు.

సచివాలయ ఉద్యోగుల గురించి తమకే బాధ్యత ఉన్నట్లుగా, తమ హయాంలో ఉద్యోగాలు ఇచ్చినట్లు టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. జూన్ తరువాత యథాప్రకారం నిబంధనల మేరకు సచివాలయ ఉద్యోగులకు జీతాలు వస్తాయని స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగాలు పట్ల ప్రభుత్వం బాధ్యతగా ఉందని అన్నారు. దీనిపై తెలుగుదేశం అతిగా స్పందించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం జగన్ ముందుచూపుతో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా  ఏకకాలంలో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా సీఎంకే దక్కుతుందని పేర్కొన్నారు. సచివాయాల ద్వారా ప్రజలకు పారదర్శకమైన పాలనను అందిస్తున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ లో సీఎం అనేక సంస్కరణలను తీసుకువచ్చారని తెలిపారు. గతంలో పంచాయతీ కార్యదర్శలు గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ 4 వరకు ఉండేవారని తెలిపారు. అయితే సీఎం శ్రీ వైయస్ జగన్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన తరువాత  గ్రేడ్ 5 కింద రెండు విడతల్లో మొత్తం 7040 పోస్టులకు గానూ 6778 పోస్ట్ లను భర్తీ చేశామని తెలిపారు. అలాగే గ్రేడ్ 6 కింద 11,150 డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ లకు గానూ 9376 పోస్ట్ లు భర్తీ చేయడం జరిగిందని వెల్లడించారు. సర్వీస్ కమీషన్ కు ఇవ్వకుండా పంచాయతీరాజ్ శాఖ ద్వారానే రెండు విడతల్లో ఈ పోస్ట్ లను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement