Monday, March 25, 2024

బాలుడి హత్య..

యర్రగొండపాలెం : బండరాయితో తలపై మోది బాలుడిని అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన పట్టణ శివారులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం తుపాకుల సాయికళ్యాణ్‌(8) తన అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకువెళ్లి మార్కాపురంరోడ్డులోని ఆనకుంట సమీపంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ హత్యోదంతం తెలుసుకున్న మార్కాపురం డిఎస్‌పి యం.కిశోర్‌కుమార్‌ , సిఐ దేవప్రభాకర్‌లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సిఐ కథనం ప్రకారం దాదాపు 10 సం.ల క్రితం దాచేపల్లికి చెందిన తుపాకుల శ్రీను, లక్ష్మీల వివాహం జరిగింది. సాయికళ్యాణ్‌ పుట్టిన తర్వాత భార్యాభర్తలు విడిపోయారు. ఆ తర్వాత లక్ష్మి మరొకరితో అక్రమసంబంధం పెట్టుకుందని తెలిపారు. కొన్‌న రోజుల తర్వాత ఆ వ్యక్తితో కూడా తెగదెంపులు చేసుకుని ఒంటరిగా జీవనం సాగిస్తోందని, తన కుమారుడిని తన తల్లివద్ద ఉంచి మిర్యాలగూడలో చీరల వ్యాపారం చేసుకుంటుందని తెలిపారు. అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి తన వద్దకు రాలేదన్న కోపంతో గత కొంతకాలంగా ఆమెను బెదిరిస్తున్నాడని, ఆ వ్యక్తే సాయికళ్యాణ్‌ను హత్య చేసి ఉంటాడన్న కోణంతో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి 12గం.ల తర్వాత మృతుడి అమ్మమ్మ కృష్ణవేణి తన బంధువులతో వచ్చి సాయికళ్యాణ్‌ కనిపించడం లేదని ఫిర్యాదు చేసిందని, ఈ క్రమంలో బాలుడు హత్యచేయబడినట్లు గుర్తించామని సిఐ తెలిపారు. నిందితుని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌ స్వ్కాడ్‌లను రప్పించారు. సంఘటన స్థలం నుండి డాగ్‌ బాలుడు ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి ఆగిపోయింది. నిందితుడి ఆచూకీ కోసం క్లూస్‌ టీం ఎస్సై శరత్‌బాబు వేలిముద్రలను సేకరించారు. త్రిపురాంతకం, పెద్దారవీడు ఎస్సైలు కృష్ణయ్య, రామకృష్ణలు నిందితునికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement