Thursday, April 25, 2024

వినియోగం “ప‌వ‌ర్” ఫుల్…

పెరిగిన గృహ విద్యుత్‌ వినియోగం
అంతరాయల్లేని విద్యుత్‌ సరఫరా కోసం ఏర్పాట్లు
కరోనా కర్ఫ్యూతో పెరిగిన వాడకం
మారుమూల ప్రాంతాలకూ 24/7 విద్యుత్‌ సరఫరా
ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

అమరావతి, : కోవిడ్‌ రెండో దశ వ్యాప్తిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ మూలంగా గృహ విద్యుత్‌ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు కర్ఫ్యూమూలంగా ప్రజలంతా మధ్యాహ్నం 12 గంటల తరువాత ఇంటివద్దే ఉండటం వంటి కారణాలతో గృహ విద్యుత్‌ వినియోగానికి డిమాండ్‌ పెరిగింది. ఈనేపథ్యంలో రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు ఆ డిమాండ్‌ను సమర్ధవంతం గా ఎదుర్కొనేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల తనిఖీలు, విద్యుత్‌ లైన్ల మరమ్మ తులు, సబ్‌స్టేషన్ల పర్యవేక్షణ వంటి కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇదే క్రమంలో కోవిడ్‌ రెండో దశ వ్యాప్తి తీవ్రతరమ వుతున్న నేపథ్యంలో 24/7 విద్యుత్‌ సరఫరా చేసేందుకు విద్యుత్‌ సంస్థలు నిరంతర విద్యుత్‌కు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నాయి. కోవిడ్‌ విపత్కర పరిస్థితులనెదుర్కొంటూనే విద్యుత్‌ సంస్థలు నిలదొక్కుకుని ప్రజలకు నిరంతర విద్యుత్‌ అందించేందుకు అహరహరం శ్రమి స్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సామాజిక బాధ్యతగా సిబ్బంది తమ వంతుక సహాయ సహకారాలు అందిస్తు న్నారు. 2019-2020 ఆర్ధిక సంవత్సరంలో గృహ వినియో గానికిగానూ 15,452 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ వినియోగం జరిగింది. అదే 2020-2021 ఆర్దిక సంవత్సరం వచ్చే నాటికి ఆ వినియోగం 16,898 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే రోజుకు సగటు విద్యుత్‌ డిమాండ్‌ గత ఏడాది ఏప్రిల్‌లో ఉన్న 156 మిలియన్‌ యూనిట్ల నుండి ఏడాది ఏప్రిల్‌ నాటికి 209.8 మిలియన్‌ యూనిట్లకు చేరుకోవడం గమనార్హం. ఇది మే చివరి నాటికి 211 మిలియన్‌ యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రతి మారుమూల పల్లెకూ నిరంతర విద్యుత్‌..
రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూ సమయంలో విద్యుత్‌ డిమాండ్‌ను ఎదుర్కొని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వినియోగారులకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ను అందిచాలని రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు విద్యుత్‌ ఉన్నతాధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విద్యుత్‌ వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయి సామగ్రి, సిబ్బందితో అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
సిబ్బంది పనితీరు అభినందనీయం
ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు, అకాల వర్షాలు, వరదల సమయంలో విద్యుత్‌ సంస్థల సిబ్బంది కనబర్చిన పనితీరు ప్రశంసనీయమన్నారు. ఇటువంటి పరిస్థితు లను ఎదుర్కోవడం సిబ్బందికి కొత్తేమీ కాదన్నారు. గత ఏడాది ఉభయ గోదావరి జిల్లాల్లో వర్ష భీభత్సం సందర్భంగా డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగించి కాలువలు, చెరువుల గట్ల వెంబడి పడిపోయిన స్థంభాలను పునరుద్ధరించి విద్యుత్‌ సరఫరాను సకాలంలో అందించిన సిబ్బంది పనితీరు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా విద్యుత్‌ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ నిరంతరాయ విద్యుత్‌ అందించేందుకు తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా ముందుగానే డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణను పూర్తిస్థాయిలో చేపట్టి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, ఒకవేళ అవి ఫెయిల్‌ అయిన క్రమంలో గంటల వ్యవధిలో వాటిస్థానంలో వేరేవాటిని ఏర్పాటుచేసే మెకానిజం అభివృ ద్ధి చేశామన్నారు.
డిస్కమ్‌ల సీఎండీలు ఎస్‌ నాగలక్ష్మి, హెచ్‌ హరనాథ రావు, జే పద్మా జనార్థన్‌ రెడ్డి తమతమ పరిధిలో తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు. సిస్టం యావరేజ్‌ ఇంటరప్షన్‌ డ్యూరేషన్‌ ఇండెక్స్‌ (ఎస్‌ఏఐడీఐ) సగటు 2019-2020 ఆర్ధిక సంవత్స రంలో 8 గంటలు ఉంటే దానిని ఈ ఆర్ధిక సంవత్సరంలో 6 గంటలకు తీసుకొచ్చి 27 శాతం మేర తగ్గించ గలిగామని తెలిపారు. కోవిడ్‌ – 19 విపత్తు సమయంలో సిబ్బంది 24 గంటలు పనిచేస్తూ ప్రజలకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ అందించడంలో కృతకృ త్యులవుతున్నారని చెప్పారు. వారి అంకిత భావం, చిత్తశుద్ది నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా ప్రజలకు అందిం చేందుకు ఎంతగానో దోహదపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ఇంధన కార్యదర్శి శ్రీకాంత్‌ మాట్లాడుతూ, కోవిడ్‌-19 నేపథ్యంలో నోడల్‌ ఆఫీసర్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రికి వివరించారు. డిస్కంల నుండి ఒక్కొక్క అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా తీసుకుని నిరంతరాయ విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement