అమరావతి, ఆంధ్రప్రభ : ప్రస్తుత వేసవి సెలవుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యాయామ శిక్షణ కార్యక్రమాల నిబంధనలను సడలిస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం తెలిపారు. వేసవి శిక్షణా కాలంలో వ్యాయామ తరగతులు మరియు ఫి-ట్నెస్ శిక్షణా కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించాలని తొలుత ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే వేసవి సెలవుల్లో రెండు పూటలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఇబ్బందికరంగా ఉంటోందని విషయాన్ని వ్యాయామ ఉపాధ్యాయులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు.
ఈమేరకు సమస్యను వివిధ సంఘాలతో పాటు, ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం పక్షాన విద్యాశాఖ కమిషనర్కి తాము లేఖ రాశామని, ఫలితంగా వ్యాయామ శిక్షణ తరగతులను నిర్బంధంగా కాకుండా ఐచ్చికంగా నిర్వహించుకోవచ్చని, ఉదయం మాత్రమే శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. కాగా తమ వినతిపై సానుకూలంగా స్పందించి, తగు ఉత్తర్వులు జారీ చేసినందుకు సామల హర్షం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..