Thursday, April 25, 2024

గర్భవతీ కాదు, బిడ్డా పుట్టలేదు.. బిడ్డను ఎత్తుకెళ్లారని వివాహిత హడావిడి..

ఇబ్రహీంపట్నం, (ప్రభ న్యూస్): తాను గర్భవతినని భర్తను, స్థానికులను నమ్మించడమే కాకుండా అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొట్ట కోసి తన బిడ్డను మాయం చేశారని ఓ వివాహిత ఆడిన నాటకం విస్తుగొల్పొంది. ఈ సంఘటన బుధవారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజ‌య‌వాడ‌లో చర్చనీయాంశమైంది. పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ ప్రారంభించడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. సేకరించిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువతికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం కలుగకపోవడంతో చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలు అంటున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి తాను గర్భవతినని భర్త, చుట్టుపక్కల వారిని నమ్మించింది.

ఇందుకోసం తొమ్మిది నెలలుగా పొట్ట చుట్టూ వస్త్రాలు చుట్టి నటించింది. అంతే కాకుండా జనవరి ఐదో తేదీ ప్రసవం కానున్నట్లు తెలిపింది. తెల్లవారితే నిజం తెలిసిపోతుందని గ్రహించి మరో నాటకానికి తెరతీసింది. అసలు గర్భం రాకుండానే తొమ్మిది నెలలు నటించిన యువతి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తన పొట్టను కోసి బిడ్డను ఎత్తుకెళ్లారని నమ్మబలికింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో యువతి నాటకమాడినట్లు తెలియడంతో నివ్వెరపోయారు. మానవీయ కోణంలో ఆలోచించిన పోలీసులు యువతిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement