Thursday, March 28, 2024

భయం వద్దు… అపోహాలొద్దు…

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ అందరికీ సెకండ్ డోస్ వేస్తామని, ఎటువంటి భయాందోళనలకు, అపోహాలకు గురికావొద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కోరారు. ఈ నెలలో కేంద్రమిచ్చే డోస్ లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసే డోస్ లను నిర్ధేశించిన సమాయానికే సెకండ్ డోస్ కు వినియోగిస్తామన్నారు. వారికి వేయగా మిగిలితే ఫస్ట్ డోస్ గా టీకాలు వేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రభుత్వ అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమిడెసివిర్, ఆక్సిజన్ కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు.  సెకండ్ డోస్ వేస్తారో…లేదో…అనే అనుమానం, భయాందోళనలు వద్దని ఆయన భరోసా ఇచ్చారు. మొదటి డోస్ తీసుకున్న వాళ్లందరికీ సెకండ్ డోస్ వేసి తీరతామన్నారు. కోవాగ్జిన్ కు నాలుగు వారాలు, కొవిషీల్డ్ 6 నుంచి 8 వారాల టైమ్ లిమిట్ దాటకుండా సెకండ్ డోస్ వేస్తామన్నారు. సెకండ్ డోస్ వేయగా మిగిలిన డోస్ లనే ఇతరులకు ఫస్ట్ డోస్ గా వేస్తామన్నారు. వ్యాక్సిన్ కోసం బ్యాంకు, ఏపీఆర్టీసీ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, తమకు వ్యాక్సిన్ ఇవ్వాలని కోరుతున్నారన్నారు. ఈ నెల 15లోగా కేంద్ర ప్రభుత్వం నుంచి 9 లక్షల డోస్ లు, 13 లక్షల డోస్ లను  రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేయనుందని, ఈ మొత్తం 19 లక్షల డోస్ లను సెకండ్ డోస్ లుగా వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

గడిచిన 24 గంట్లో 1,16,367 కరోనా టెస్టులు నిర్వహించగా.. 22,204 పాజిటివ్ కేసుల నమోదయ్యాయని, 85 మంది మృతిచెందారని ఆయన తెలిపారు. గడిచిన 24 గంటల్లో 387 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ప్రభుత్వాసుపత్రులకు, ప్రైవేటు ఆసుపత్రులకు సప్లయ్ చేశామన్నారు. ఆక్సిజన్ కొరత రాబోతున్నదని నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు… సంబంధిత జిల్లా కలెక్టర్  దృష్టికి తీసుకురాగానే సతీష్ దావన్ శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) సాయంతో 12 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను ఆయా ఆసుపత్రులకు సకాలంలో అందజేశామన్నారు. ఆక్సిజన్ సరఫరాలో జాప్యం జరకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు.  ప్రభుత్వాసుపత్రుల్లో రెమిడెసివిర్ 15,037 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. బుధవారం సాయంత్రం మరో 12 వేల వాయిల్స్ అందజేస్తున్నామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 11,556 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 5,248 ఇంక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం వద్ద అనుమతులు పొందిన 206 ఆసుపత్రులకు 6,308 డోసుల సప్లయ్ చేశామన్నారు.

కాల్ సెంటర్ ద్వారా కరోనా బాధితులకు సేవలు అందించడానికి అధిక సంఖ్యలో డాక్టర్లు ముందుకొస్తున్నారని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా బాధితులకు ఫోన్ ద్వారా సలహాలు సూచనలు అందించాలని కోరినప్పుడు తొలుత 200 మంది డాక్టర్లు మాత్రమే తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారన్నారు. ప్రస్తుతం 3,220 డాక్టర్లు… కరోనా బాధితులకు ఫోన్ల ద్వారా సేవలందించడానికి ముందుకొచ్చారన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఎలా ఉండాలి… తక్కువ లక్షణాలు ఉన్నప్పుడు ఏవిధమైన మందులు వాడాలి… తీవ్రంగా ఉన్నపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అనే వివరాలను కరోనా బాధితుకలు ఫోన్ ద్వారా తమ ఇళ్ల నుంచే డాక్టర్లు సలహాలు సూచనలు అందజేస్తున్నారన్నారు. గడిచిన 24 గంటల్లో కాల్ సెంటర్ కు 17,190 కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో వివిధ రకాల సమాచారాల నిమిత్తం 5,949, ఆసుపత్రుల్లో అడ్మిషన్లకు 4,229, కరోనా టెస్టుల కోసం 3,737, టెస్టుల ఫలితాలకు 2,042 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement