Tuesday, March 26, 2024

ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్.చక్రధర్ బాబు తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నుండి లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని చక్రధర్ బాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో ఉదయం 8 గంటల నుండి ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛ‌గా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. మొదట ఒక గంటలో 4 శాతం పోలింగ్ నమోదు అయిందని పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా విధులు నిర్వరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 169 పోలింగ్ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుతో పాటు వేసవికాలం దృష్ట్యా ఓటర్లుకు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. అన్ని గ్రామాల్లో ఓటర్ స్లిప్ ల పంపిణీతో పాటు అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ఎమెల్సీ ఎన్నికల ఓటు హక్కు విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని నాలుగు రెవిన్యూ డివిజన్స్ లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయడంతో పాటు లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించడం జరుగుచున్నదన్నారు. పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు నాలుగు డివిజన్స్ కు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలు పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను 4 డివిజన్స్ లోని రిసెప్షన్ కేంద్రాల నుండి నేరుగా చిత్తూరు రిటర్నింగ్ అధికారికి అందచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లందరూ స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, పొల్యూష కంట్రోల్ బోర్డు ఈఈ, వెబ్ కాస్టింగ్ నోడల్ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికలకు సంబంధించి ఉదయం.10.00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది.
పట్టభద్రులు ఎమ్మెల్సీ : 8.94 శాతం
ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ : 16.55 శాతం నమోదయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement