Friday, April 19, 2024

ఎవరెన్ని కుట్రలు పన్నినా అంతిమ విజయం వైఎస్సార్సీపీ దే -ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

పొదలకూరు, ఎవరెన్ని కుట్రలు పన్నినా అంతిమ విజయం వైఎస్సార్సీపీ దేనని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆయన తన స్వగ్రామమైన పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పరామర్శకు, పరవశానికి జయంతి, వర్ధంతి లకు తేడా తెలియని లోకేష్ బాబు ప్రచారం చేస్తే ఓట్లు పెరుగుతాయని టీడీపీ నేతలు భ్రమ పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ బాబు లు ప్రచారం చేస్తే తమకు పది శాతం ఓట్లు పెరుగుతాయని, టీడీపీకి పది శాతం ఓట్లు తగ్గుతాయన్నారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక బహిష్కరణ పేరుతో చంద్రబాబు నాటకం ఆడారని దుయ్యబట్టారు. చంద్రబాబు లోకేష్ లు ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఆంధ్ర రాష్ట్ర జనం జగన్ వెంటే ఉన్నారని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తోపాటు ఈ నెల 17న జరగనున్న తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా తాము అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే 27 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. ఎన్నికలను ఎలాగైనా అడ్డుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు రకరకాల విన్యాసాలు చేశాడని దుయ్యబట్టారు. చంద్రబాబు బహిష్కరణ ఆదేశాలను కొందరు నాయకులు, కార్యకర్తలు తుంగలో తొక్కారని పేర్కొన్నారు. కొందరు టిడిపి నాయకులు ఎన్నికల పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నారని, మరి కొందరు ఎన్నికల ప్రచారం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పొదలకూరు వైసీపీ జడ్పిటీసీ అభ్యర్థి తెనాలి నిర్మల, తోడేరు మాజీ ఎంపీటీసీ ఏనుగు శశిధర్ రెడ్డి, వైసీపీ నాయకులు అట్ల రవీంద్ర, ఏనుగు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement