Thursday, March 28, 2024

పందుల వ్యాను ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి..

చేజర్ల ఫిబ్రవరి 19 (ప్రభ న్యూస్): ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులను ఎదురుగా వస్తున్న పందుల వ్యాను ఢీకొని ఇంటర్మీడియట్ చదువుతున్న షర్ఫుద్దీన్ (18) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రమైన చేజర్ల గ్రామ సమీపంలో ఉన్న నాగ శిలల వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చేజర్ల నుండి తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన తన స్నేహితుడు సయ్యద్ యూసఫ్ ఇంటి వద్ద వదిలి పెట్టేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పందుల లోడుతో ఎదురుగా వస్తున్న ఆల్విన్ వ్యాన్ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు.

దీంతో చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షర్ఫుద్దీన్ తలకి బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక వైపు కూర్చొని ఉన్న యూసఫ్ కి తీవ్ర గాయాలు కావడం వల్ల 108 వాహన సాయంతో నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మరిడి నాయుడు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షర్ఫుద్దీన్ మృతి పట్ల చేజర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి ప్రమాదానికి గురైన పందుల వ్యాను ను పోలీస్ స్టేషన్ కి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మరిడి నాయుడు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement